పాకిస్థాన్ వినియోగిస్తున్న చైనా తయారీ ఆయుధాల పనితీరుపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. భారత రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ కులకర్ణి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత వేడి పుట్టించాయి. ఆయన చెప్పినట్లుగా, భారత్ సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఘటనల్లో పాక్ సైన్యం వినియోగించిన చైనా డ్రోన్లు, క్షిపణులు విఫలమయ్యాయి. ఈ కారణంగా చైనా సరఫరా చేస్తున్న ఆయుధాల నాణ్యతపై అనుమానాలు మొదలయ్యాయి.
ఇది కేవలం సాధారణ సాంకేతిక లోపమా లేదా ఉద్దేశపూర్వకంగా తక్కువ నాణ్యత కలిగిన ఆయుధాల సరఫరా జరుగుతోందా? ఈ ప్రశ్నను రక్షణ నిపుణులు లేవనెత్తుతున్నారు. పాక్ వంటి దేశాలకు చైనా తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో ఆయుధాలు విక్రయిస్తోంది. కానీ వాటి పనితీరు పరిశీలించినప్పుడు నాసిరకం పరికరాల రేంజ్లో ఉండడం గమనార్హం. ఇదే నిజమైతే, పాకిస్థాన్ సైనిక సామర్థ్యానికి అది పెద్ద ఎదురు దెబ్బ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సరిహద్దులో స్వాధీనం చేసుకున్న డ్రోన్లు, క్షిపణుల శకలాల విశ్లేషణలో కూడా ఇదే తేలుతోందని కులకర్ణి పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత పాక్ సైన్యం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాక్, చైనాకు బలంగా ఆధారపడుతున్న సందర్భంలో, తక్కువ నాణ్యతా ఆయుధాల వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఇది పాకిస్థాన్తో పాటు చైనా అంతర్జాతీయ మార్కెట్కు కూడా వార్నింగ్ గానే మారుతుంది. ఎందుకంటే చైనా నిర్మిత ఆయుధాల విశ్వసనీయతపై మిగతా దేశాలకూ సందేహాలు మొదలయ్యే అవకాశముంది. ఇక ఈ పరిణామాలు భారత్కి మాత్రం ఒక అవకాశంగా మారవచ్చు. చైనా ఆయుధాల పరాజయం పాకిస్థాన్ ఆర్మీకి గట్టి హెచ్చరిక ఇవ్వడమే కాకుండా, రక్షణ రంగంలో కొత్త వ్యూహాలు రూపొందించుకునే దిశగా భారత్ ముందుకు వెళ్లే అవకాశం కల్పించనుంది.