ఆ విషయంలో ప్రియాంక నిర్ణయమే ఫైనలన్న రాహుల్ గాంధీ

సోదరి ప్రియాంకాగాంధీ ఎన్నికల క్షేత్రంలోకి వచ్చే విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ క్లారిటీ ఇచ్చారు. జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న విషయంలో తుది నిర్ణయం ఆమెదేనని రాహుల్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రియాంకాగాంధీ బరిలో నిలవనున్నారన్న వార్తల నేపథ్యంలో రాహుల్‌గాంధీ చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

మా పార్టీలో అభ్యర్థుల ఎంపికకు ఓ విధానం ఉంటుందని, ఈ విషయంలో అనుభవజ్ఞులకు ఎంత ప్రాధాన్యం ఇస్తామో, కొత్త ముఖాలకు అంతే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండో స్థానం నుంచి పోటీ చేసే విషయంపైనా ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ క్లారిటీ ఇచ్చారు.

గతంలో నానమ్మ ఇందిరాగాంధీ, అమ్మ సోనియాగాంధీ, ఆఖరికి ప్రధాని నరేంద్రమోదీ కూడా రెండేసి చోట్ల పోటీ చేసిన సందర్భాలున్నాయని, తాను పోటీ చేస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. అందుకే పార్టీ అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.