మొత్తానికి ఉత్తరాన్ని కోల్పోయిన కాంగ్రస్ పార్టీలో దక్షిణ భారతదేశాన్నయినా కాపాడుకోవాలనే తాపత్రయం ఎక్కవయింది. దీనికోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది. ఏకంగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే కదనంలోకి దుముకుతున్నారు.
కేరళలోని వాయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ ప్రకటించారు.
ఉత్తర భారత దేశంలోని కాంగ్రెస్ అక్కడక్కడ తప్ప ఎక్కడా పూర్తిగా మిగల్లేదు. దక్షిణ భారతంలో కూడా పతనం ప్రారంభమయింది. పోయిన తూరి 2014లో ఆంధ్రప్రదేశ్ లో ఒక్కీసీటు కూడా గెలవలేదు. ప్రత్యేక రాష్ట్రం ప్రసాదించినా తెలంగాణలో కొనవూపిరితోనే కొట్టుమిట్టాడుతూ ఉంది. తమిళనాడు ఎపుడూ లేదు. కేరళలో ఉన్నది వూడే పరిస్థితి వస్తూన్నది. బిజెపి కేరళనువశపర్చుకోవాలని చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నది. కర్నాటక లోనే ఆ పార్టీ కొంత ధైర్యంగా ఉంది. ఎందుకంటే, కాంగ్రెస్ సొంత ప్రభుత్వం పోయినా, సంకీర్ణ రూపంలో కొనసాగుతూ ఉంది. బిజెపి రాకుండా అడ్డుకోగలిగింది. ఈనేపథ్యంలో రాహుల్ తాను దక్షిణాదికి కూడా ప్రతినిధి అని చెప్పుకునేందుకు కేరళవస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని అమెధీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తుందని బిజెపి ప్రకటించిన రెండు రోజుల తర్వాత కేరళ పిసిసి అధ్యక్షుడు ఈ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.
కేరళ నుంచి పోటీ చేయాలని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ చేసిన విన్నపాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంగీకరించారని రామచంద్రన్ తెలిపారు. ఎఐసిసి జనరల్ సెక్రెటరీ, ఆంధ్రప్రదేశ్ ఇన్ చార్జ్ ఊమన్ చాందీ ఈ విషయాన్ని ధృవీకరించారు.
రెండు రోజులుగా, ప్రధాని నరేంద్రమోదీ కర్నాటక నుంచి పోటీ చేస్తారని వార్తలొస్తున్నాయి. ఇదింకా తేలకముందే రాహుల్ ఒకడుగు ముందుకేసి తన రెండో స్థానానికి కేరళను ఎంచుకున్నారు. మోదీ వారణాసి నుంచే కాకుండా బెంగుళూరులోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. మొత్తానికి దక్షిణ భారత దేశాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్, కైవసం చేసుకునేందుకు బిజెపి ప్రయత్నాలుచేస్తున్నాయనేది స్పష్టం. బిజెపి ఆదుర్దా ఏమిటంటే, దక్షిణ భారతదేశంలో ప్రజలు కాంగ్రెస్ ను ఓడించినా మరొక జాతీయపార్టీ అయిన బిజెపి వైపు గాని,దాని నేత నరేంద్ర మోదీ వైపు చూడటంలేదు. ప్రాంతీయ నాయకులను కోరుకుంటున్నారు. అందుకే బిజెపికి కాలుమోప జాగ కూడా దొరకడం లేదు. అందుకే ఆయన దేశానికి బలమయిన నాయకత్వం, సమగ్రత, సైన్యం వంటి మాటలతో వస్తున్నారు. దక్షిణాన ప్రాంతీయ నాయకుల్లో దేశం బాగోగులను ప్రజలు చూస్తున్నారు.ఇదే బిజెపికి నచ్చడం లేదు. అది వేరే కథ.
2014 ఎన్నికల్లో వాయనాడ్ సీటులో కాంగ్రెస్ అభ్యర్థి ఎం ఐ షానాస్ కేవలం 20,870 వోట్ల ఆధిక్యత మాత్రమే తెచ్చుకున్నా ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు పెట్టని కోట వంటిది. గత ఏడాది నవంబర్ షా నవాస్ చనిపోయారు. అప్పటి నుంచి సీటుఖాళీగానే ఉంది.
రాహుల్ ఉత్తరప్రదేశ్ తో పాటు దక్షిణ భారత దేశం లోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చాలా రోజులుగా వూహాగానాలు వినబడుతూనే ఉన్నాయి. ఆయన కర్నాకటలోని బీదర్ నుంచి పోటీ చేస్తారని కూడా వినిపించింది. అపుడు కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్రల మీద కాంగ్రెస్ పట్టు పెరుగుతుందని ఆశించారు.
ఇపుడ వాయనాడు పేరు వినపడుతూ ఉంది. నిజానికి ఈ సీటును టి సిద్దిఖి అనే నాయకుడిని ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టారు. ఇపుడు రాహుల్ వస్తూండటంతో తనకు అసంతృప్తి లేదని, రాహుల్ కోసం పనిచేస్తానని సిద్ధిఖిప్రకటించారు
శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ, కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేయాలని కేరళ పార్టీ కార్యకర్తలు రాహుల్ను కోరారని, కేరళ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఢిల్లీలో చెప్పారు. ఉత్తర ప్రదేశ్ లోని అమేథి గురించి మాట్లాడుతూ అమేథీ తన ‘కర్మభూమి’ అని రాహుల్ చెబుతుంటారని, అమేథీ ఆయనతోటే ఉంటుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి
https://telugurajyam.com/will-modi-contest-from-benguluru-south-as-well/
