దేశ వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ… సంచలన ప్రకటన చేసిన రాహుల్ గాంధీ

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది నేతల మధ్య మాటల యుద్దంతో పాటు హామీల వర్షం కురుస్తోంది. పలు కీలక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆకట్టుకునే యోచనలో నేతలు పడ్డారు. తాజాగా రాహుల్ గాంధీ దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులందరికి కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. దీంతో బిజెపి బడ్జెట్ లో తెలివిగా రైతులకు 6 వేల రూపాయల పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ప్రకటించింది. ఇక రాహుల్ గాంధీ దీనికి దెబ్బ కొట్టేలా మరో సంచలన ప్రకటన చేశారు. పాట్నాలో కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఏమన్నారో ఆయన మాటల్లోనే…

“ఈ దేశానికి కాపలాదారుగా ఉంటానన్న వారే దొంగల్లా తయారయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతులకు రుణాలు మాఫీ చేస్తాం. రుణాల మాఫీ పై పరిమితి లేదు. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసి తీరుతాం. ఈ మద్యే ప్రకటించిన కనీసం వేతన పథకాన్ని కూడా అమలు చేసి చూపిస్తాం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈ పథకాలు అమలు చేయబోతున్నాం.

ప్రధాని మోదీ బీహార్ తో పాటు దేశంలోని రైతులందరిని అవమానపరిచారు. అందుకు రైతులు సరైన సమాధానం ఇస్తారు. మాకు కాంగ్రెస్పే కావాలి బిజెపి వద్దు అని రైతులు అంటున్నారు. మోదీ ప్రభుత్వం అవినీతి పరులకు కోట్ల రూపాయలు కట్టబెడుతోంది. రైతులకు మాత్రం రోజుకు 17 రూపాయలే ఇస్తామంటోంది. బిజెపి హామీలను మాత్రమే ఇస్తుంది. కాంగ్రెస్ మాత్రం తమ హామీలను నిలబెట్టుకుంటుంది.

ప్రధాని మోదీ చెప్పినట్టుగా ఏ ఒక్కరి ఖాతాలోనైనా 15 లక్షల రూపాయలు పడ్డాయా… ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్  లలో బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులకు రుణాలు మాఫీ చేశాం. యూపీలో మేం బ్యాక్ ఫుట్ ఆడబోం. లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్ లతో కలిసి ఫ్రంట్ ఫుట్ ఆడబోతున్నాం. ఖచ్చితంగా ప్రజా తీర్పు మాకు అనుకూలంగానే ఉంటుంది. కలిసి వచ్చే అందరితో కలిసిపోతాం.” అని రాహుల్ గాంధీ అన్నారు.

రాహుల్ గాంధీ రోజుకో కొత్త ప్రకటన చేయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. రాహుల్ గాంధీ రైతుల పై కీలక ప్రకటనలు చేయడంతో అధికారంలోకి రావడం ఖాయమేనన్న చర్చ జరుగుతోంది. బడ్జెట్ లో బిజెపి ప్రవేశ పెట్టిన కొత్త పథకాలకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ తమ పథకాలు ప్రకటించేందుకు సిద్దమవుతోందని తెలుస్తోంది. ఏదేమైనా నేతల ప్రకటనలతో రాజకీయం వేడెక్కింది.