రాఫెల్ వివాదం పై నివేదికిచ్చిన కాగ్… బిజెపి ప్రభుత్వానికి క్లీన్ చిట్

జాతీయ రాజకీయాలను కుదిపేస్తున్న వివాదాస్పద రాఫెల్ ఒప్పందంపై ఎట్టకేలకు ప్రభుత్వం కాగ్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. గత యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందానికి, దాని స్థానే కొత్తగా ఎన్డీయే ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందానికి మధ్య వ్యత్యాసాన్ని బయటపెట్టింది. ఈ నివేదికలోని కీలక అంశాలు ఇలా ఉన్నాయి…

ధరలు:

యూపీఏ హయాంలో రాఫెల్ యుద్ధ విమానాల కోసం జరిగిన ఒప్పందం కంటే.. ప్రస్తుత ఒప్పందంలో ధర 2.86 శాతం తక్కువగా ఉంది.

2007లో కంటే 2016లో 36 ఫ్లైఅవే విమానాల ధర 9 శాతం తక్కువ అంటూ రక్షణ శాఖ చేస్తున్న వాదనను కాగ్ కొట్టిపారేసింది.

రాఫెల్ ఒప్పందంలో 14 పరికరాలతో 6 రకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఏడు పరికరాల కోసం ఒప్పందం చేసుకున్న ధరలు హేతుబద్ధమైన ధర కంటే ఎక్కువగా ఉన్నాయి.

సాధారణ విమానం సహా మూడు పరికరాలు కూడా అదే ధరకు కొనుగోలు చేశారు. నాలుగు పరికరాలను మాత్రం అసలు ధర కంటే తక్కువ ధరకు కొన్నారు.

సరఫరా:

2007 ఒప్పందం కంటే ఒకనెల ముందుగానే తాజా ఒప్పందం తాలూకు యుద్ధ విమానాలు దేశానికి వస్తాయి. గత ఒప్పందంలో గడువు 72 నెలలుగా ఉండగా… 2016 ఒప్పందం ప్రకారం 71 నెలల్లోనే ఎగరడానికి సిద్ధంగా ఉన్న విమానాలు సరఫరా అవుతాయి.

2007 ఒప్పందం ప్రకారం సంతకాలు జరిగిన 50 నెలల్లో 18 విమానాలు సరఫరా చేయాల్సి ఉంది. తర్వాతి 18 విమానాలు హెచ్ఏఎల్‌లో తయారు చేసి.. ఒప్పందం కుదిరిన 49 నుంచి 72 నెలల్లోగా అందించాలి. అయితే 2016 కాంట్రాక్టు ప్రకారం… తొలి 18 విమానాలు 36 నుంచి 53 నెలల్లోగానూ, మిగతా 18 విమానాలు 67 నెలల్లోగా అందించాల్సి ఉంటుంది.

హామీ:

న్యాయశాఖ సలహా మేరకు రక్షణ శాఖ ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి సావరిన్ గ్యారంటీ కోరింది. అయితే ఫ్రాన్స్ ప్రభుత్వం కేవలం ‘‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’’ మాత్రమే ఇచ్చింది.

ఆర్ధిక భద్రత కోసం ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లింపులు చేయాలని రక్షణ శాఖ కోరినప్పటికీ ఫ్రాన్స్ అందుకు అంగీకరించలేదు.

2007 కాంట్రాక్టు ప్రకారం దసో ఏవియేషన్ ఆర్ధిక పూచీలతో పాటు పనితీరు సేవలను ఆఫర్ చేసింది. కాంట్రాక్టులోని మొత్తం విలువలో 25 శాతానికి పైగా ఇదే ఉంది.

దసో కంపెనీ టెండర్ ధరను కచ్చింతంగా నిర్ణయించి చెప్పాడు. కానీ 2016 కాంట్రాక్టులో అలాంటి పూచీ ఇవ్వలేదు. దీని కారణంగా దసో ఏవియేషన్‌కు ఆదా అయిన మొత్తంలో భారత్ బదలాయించే అవకాశం లేకుండా పోయింది.  

కాగ్ నివేదిక పనికిమాలినదని, ఇది చౌకీదార్ రిపోర్ట్ అని కాంగ్రెస్ అధినేత రాహుల్ దుయ్యబట్టారు. పార్లమెంటు ప్రారంభానికి ముందు రాహుల్ , సోనియా ఆధ్వర్యంలో పార్లమెంటు ముందు ఆందోళన చేపట్టారు. బడ్జెట్ పై చర్చ లేకుండానే ఉభయ సభలు దీర్ఘకాల వాయిదా పడ్డాయి.