పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం ఆందోళనలో ఉండగా, ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీలకు శ్రీకారం చుట్టారు. శనివారం ఆయనతో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటీ ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించనున్న పరిణామాలకు సంకేతమని భావిస్తున్నారు. ప్రత్యేకించి పాకిస్థాన్తో సంబంధాల ముంచుకొస్తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చేందుకు భారత్ అన్ని దిశల నుంచీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే పాక్పై ఎన్నో ఆంక్షలు అమల్లోకి తెచ్చిన కేంద్రం, ఇప్పుడు రక్షణ రంగంలోనూ కీలక చర్యలకు సన్నద్ధమవుతోంది. మోదీ ఇప్పటికే నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠితో కూడా భేటీ అయ్యారు. ఇదంతా సమన్విత దాడుల దిశగా సాగుతున్న ప్రణాళికల సంకేతంగా విశ్లేషిస్తున్నారు.
ఇక భద్రత వ్యవహారాలపై కేబినెట్ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్రవాద శిబిరాలపై యాక్షన్కు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఇప్పటికే వాయుసేన యుద్ధ సన్నద్ధతలో భాగంగా ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్వేపై యుద్ధ విమానాలతో విన్యాసాలు చేసి చాప్టర్ ఓపెన్ చేసింది. ఇది కేవలం రిహర్సల్ మాత్రమేనా? లేక వచ్చే దాడికి ప్రాక్టీసా? అనే సందేహాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ చీఫ్తో మోదీ భేటీ కేవలం సమీక్షకే పరిమితమా? లేక దాడికి సమయం నిర్ణయించేందుకు కీలకమైన అడుగా అనే ప్రశ్నలు ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.