మంత్రి వరద బాధితులకు బిస్కెట్లు ఎలా విసురుతున్నాడో చూడండి (వీడియో)

కేరళనే కాదు కర్ణాటకకు కూడా వరద ముంచెత్తింది. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మట్టి కోసుకుపోయి ఇళ్ళు కుప్పకూలిపోయాయి. చాలామంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో వరద బాధితులకు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మినిష్టర్ హెచ్ డీ రేవన్న వరద బాధితులకు బిస్కెట్స్ విసురుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హెచ్ డీ రేవన్న కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి సోదరుడు. ముఖ్యమంత్రి సోదరుడు, మంత్రి అయుండి వరద బాధితుల పట్ల ఆయన ప్రవర్తించిన తీరుకు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం హస్సన్ జిల్లాలో ఒక సహాయక శిబిరానికి వెళ్లిన మంత్రి బిస్కెట్ ప్యాకెట్లు విసురుతుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో టీవీలలో కూడా ప్రసారం అవడంతో రేవన్నపై జనాలు మండి పడుతున్నారు. ఆ వీడియో కింద ఉంది చూడవచ్చు.

దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి స్పందించారు. రేవన్న అహంకారభావంతో అలా చేయలేదన్నారు. అక్కడ వరద బాధితులు ఎక్కువ ఉండటంతో ఒక్కొక్కరి వద్దకు వెళ్లి ఇచ్చే పరిస్థితి లేక అలా చేశారన్నారు. టీవిలో రేవన్నపై జరిగిన చెడు ప్రచారం చూసి రేవన్న చాలా బాధపడుతున్నారని తెలిపారు.

రేవన్న కుమారుడు ప్రజ్వల్ రేవన్న మాట్లాడుతూ ఆయన చాలా నిరాడంబరమైన వ్యక్తి అని తెలిపారు. వరద బాధితులను సందర్శించి వారికి సహాయక చర్యలు తీసుకోవటానికి వెళ్లారని, తన తండ్రిపై ఇటువంటి ప్రచారం చేయవద్దని విలేఖరులను కోరారు.