కూతురిని ప్రేమించాడని… అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేశారంటే

తమ కూతురిని ప్రేమించాడని ఆ యువతి తల్లిదండ్రులు దారుణానికి పాల్పడ్డారు. ఏకంగా  ఆ యువకుడిని తీవ్రంగా కొట్టి సజీవ దహనం చేశారు. ఈ విషాదమైన ఘటన పశ్చిమ బెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లాలో జరిగింది.

ఢిల్లికి చెందిన రంజిత్ మొండల్ మిడ్నాపూర్ లో స్వర్ణకారుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన యువతితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో రంజిత్, ఆ యువతి తరచుగా కలుసుకునేవారు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. శుక్రవారం ఆ యువతిని రంజిత్ కలుసుకున్నాడు. అక్కడే కాపుకాసి ఉన్న అమ్మాయి తల్లిదండ్రులు రంజిత్ ను పట్టుకొని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారు. రంజిత్ ను ఇష్టమొచ్చినట్టు కొట్టారు.

అంతటితో ఆగకుండా ఓ కారులో పట్టణం బయటికి తీసుకెళ్లారు. అక్కడ పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి పూట గస్తీ తిరుగుతున్న పోలీసులకు మంటలు రావడం కనిపించింది.దీంతో వారు అక్కడకు వెళ్లారు. అక్కడ రంజిత్ ఫోన్ వారికి కనిపించింది. దీంతో వారు విచారించగా అసలు నిజం బయటపడింది. అమ్మాయి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయి నుంచి రంజిత్ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.