మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పై కాంగ్రెస్ వేటు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పెద్దల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత సర్వే సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ టిపిసిసి ఉత్తర్వులు జారీ చేసింది. గాందీ భవన్ లో ఆదివారం మల్కాజ్ గిరి నియోజకవర్గ సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో సర్వే సత్య నారాయణ ఆగ్రహంతో ఊగిపోయి పార్టీ నేతల పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సర్వే ఏమన్నారంటే…

“తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం పిసిసి పెద్దలే. ఓడిపోవడానికి కారణమైన నేతలే సమీక్షలు చేస్తారా.. సమీక్షలు చేయాల్సింది వేరే నేతలు మీరు కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా తమాషాలు చేస్తున్నారా. ఏ అభ్యర్ధికి కూడా డబ్బులు రాలేదు. ప్రచారం ఎలా చేస్తారనుకున్నారు. పార్టీ పంపిన ఫండ్ ఏమైంది. నేతలంతా అభ్యర్దుల దగ్గరే పైసలు తీసుకున్నారు. అందరి బండారం బయటపెడుతా” అని సర్వే సత్యనారాయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సర్వే ఆందోళన చేస్తున్న సమయంలో బొల్లం కిషన్ సర్వేను అడ్డుకోబోగా ఆయన పై బాటిల్ విసిరాడు. కోపంతో ఆయన పై కూడా ఇష్టమొచ్చినట్టుగా సర్వే మాట్లాడాడు. దీంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. ఆవేశంతోనే సర్వే సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు.

సర్వే జాతీయ స్థాయి నేత కావడంతో టిపిసిసి వెంటనే కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది.  సర్వే ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. దీంతో క్రమశిక్షణ కమిటి వెంటనే సర్వేను పార్టీ నుంచి సస్సెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది. అనేక సార్లు సర్వే సత్యనారాయణకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇచ్చినా సమావేశంలో ఆయన పార్టీ నాయకత్వం పై వ్యవహరించిన తీరు పట్ల నేతలు విస్మయం వ్యక్తం చేశారు. 

2004లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ ఎంపీగా సర్వే గెలుపొందారు. 2009 లో మల్కాజ్ గిరి ఎంపీగా  గెలిచారు. ఆ హయాంలోనే కేంద్ర జాతీయ రహాదారుల శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో మళ్లీ మల్కాజ్ గిరి నుంచి పోటి చేసి ఓడిపోయారు. 2015 లో వరంగల్ నుంచి ఉప ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోయారు. కంటోన్మెంట్ పాలకవర్గంలో సర్వే కొడుకు కూతురు పోటి  చేసి ఓడిపోయారు. 2018లో కంటోన్మెంట్ స్థానం నుంచి సర్వే పోటి చేసి ఓడిపోయారు. గొడవ జరిగిన గంటలోనే సర్వేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.