చాక్లెట్ ఇచ్చాడని బట్టలిప్పించి పరిగెత్తించారు

అగ్ర కులానికి చెందిన ఓ బాలికకు చాక్లెట్లు ఇచ్చి చేయి పట్టుకున్నందుకు 13 ఏళ్ల బాలుడిని దారుణంగా కొట్టి, బట్టలు విప్పించి పరుగెత్తించిన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగింది.

కొల్హాపూర్ లోని స్థానిక పాఠశాలలో చదువుకునే దళిత సామాజికవర్గానికి చెందిన బాలుడు సాయంత్రం ఇంటికి వెళ్తుండగా.. తోటి బాలికకు చాక్లెట్లు ఇచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు. ఇంటికి వెళ్లాక బాలిక ఈ విషయాన్ని తల్లిందండ్రులకు చెప్పడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో ఆ బాలికను ఆమె తల్లిదండ్రులు ముంబయిలోని బంధువుల ఇంటికి పంపారు.

అక్కడ విషయం తెలుసుకున్న ఆమె మామయ్య ఆ గ్రామానికి వచ్చి బాలుడిని గదిలో బంధించి తీవ్రంగా కొట్టాడు. అంతేకాక బాలుడి ఇంటి నుంచి పంచాయతీ కార్యాలయం వరకూ నగ్నంగా పరిగెత్తించాడు. అసభ్యకర పదజాలంతో దూషించాడు. బాల బాలికల కుటుంబాలకు ముందు నుంచే పరిచయం ఉందని, ఈ ఘటనతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయని కొల్హాపూర్‌ పోలీసులు తెలిపారు.

బాలుడిని అవమానపరిచిని ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. ఇరు వర్గాల వరకూ పాకకుండా గ్రామంలో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులను మోహరించినట్లు వివరించారు.