ఉత్తరప్రదేశ్ లో దారుణం.. భర్త పిలుస్తున్నాడని నమ్మించి వివాహితపై సామూహిక అత్యాచారం?

ప్రస్తుత కాలంలో మహిళలు తమకు తెలిసిన వారిని కూడా నమ్మాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో తోడబుట్టిన వారు బంధువులు స్నేహితులు అని తేడా లేకుండా వారి కామ వాంఛలు తీర్చుకోవటానికి మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్లో కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. భర్త పిలుస్తున్నాడని చెప్పటంతో తెలిసిన వ్యక్తి కదా అని వెళ్ళినందుకు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే… ఉత్తరప్రదేశ్ బరాబంకీ లోని బదోస్‌రాయ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్నావుకా గ్రామానికి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన మహిళ వద్దకు వెళ్లి భర్త పిలుస్తున్నాడని చెప్పాడు. ఈ క్రమంలో తనకు తెలిసిన వ్యక్తే కదా అని సదరు మహిళ అతడిని నమ్మి అతని వెంట వెళ్ళింది. ఈ క్రమంలో నిందితుడు మహిళను భర్త వద్దకు తీసుకువెళ్తానని చెప్పి గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకొని వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్త లేకపోవడంతో పాటు మరొక ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు.

మహిళను తీసుకువెళ్లిన వ్యక్తితో పాటు చెరువు వద్ద ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు కలిసి సదరు వివాహిత మీద అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆ మహిళను బెదిరించారు. దీంతో మహిళ భర్తకు జరిగిన విషయం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. అయితే కొంతకాలానికి ధైర్యం చేసి సదరు బాధితురాలు జరిగిన విషయం తన భర్తకు చెప్పింది. ఈ క్రమంలో బాధితురాలి భర్త శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.