మొన్న ఆర్బీఐ, నిన్న సీబీఐ..తాజాగా ఎన్ఎస్ఈ! ఏం జ‌రుగుతోంది!

దేశంలోని ప్ర‌ధాన, కీల‌క సంస్థ‌లు నియంత్ర‌ణ కోల్పోయాయా? కొద్దిరోజుల కింద‌ట రిజ‌ర్వుబ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ ఊర్జిత్ ప‌టేల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దేశ ప్ర‌ధాన ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్ట‌ర్ అలోక్ వ‌ర్మ అర్ధంత‌రంగా త‌న ప‌ద‌వీ కాలాన్ని ముగించారు. తాజాగా- నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఛైర్మ‌న్ అశోక్ చావ్లా కూడా గుడ్‌బై చెప్పారు. శుక్ర‌వారం రాత్రి ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో అయిదుమందిని విచారించ‌డానికి కేంద్రం అనుమ‌తి ఇచ్చిందంటూ సీబీఐ ఢిల్లీ హైకోర్టుకు వెల్ల‌డించిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఈ ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ అయిదుమందిలో అశోక్ చావ్లాతో పాటు కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబ‌రం, ఆయ‌న కుమారుడు కార్తి ఉన్నారు. మ‌రో ఇద్ద‌రి వివ‌రాలు తెలియరావాల్సి ఉంది. ఊర్జిత్ ప‌టేల్‌తో మొద‌లైన ఈ రాజీనామాల ప‌ర్వం నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వ‌ర‌కూ పాకింది.