పెళ్లి చూపులకు వెళుతుండగా ప్రమాదం…రైలు నుండి జారిపడి మృతిచెందిన వ్యక్తి?

ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల వల్ల మాత్రమే కాకుండా ఇలా రైళ్లు, విమానాల వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల రైలు ప్రమాదంలో ముగ్గురు రైల్వే కార్మికులు మృతి చెందిన ఘటన మరువకముందే బుధవారం తెల్లవారుజామున రైలు నుండి జారిపడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చూపులకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో వ్యక్తి తీవ్ర గాయాల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన కొవ్వూరు మండలం పశివేదల రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.

తాడేపల్లి రైల్వే ఎస్ ఐ శ్రీహరిబాబు తెలిపిన వివరాల ప్రకారం…ఒరిస్సా రాష్ట్రం గాంజామ్‌ జిల్లా పీతల సంతోష్‌పూర్‌ గ్రామానికి చెందిన సుశాంత్‌ మహాపాత్ర (29) అనే వ్యక్తి పొట్టకూటి కోసం చెన్నై వెళ్లి అక్కడ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చూపుల కోసం చెన్నై నుండి ఒరిస్సాకి వెళ్ళటానికి బరంపురం హౌరా మెయిల్‌లో ప్రయాణం అయ్యాడు.

ఈ క్రమంలో రైలులో ప్రయాణిస్తుండగా బుధవారం తెల్లవారుజామున కొవ్వూరు మండలం పశివేదల రైల్వేస్టేషన్‌ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు అతనిని108లో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై తాడేపల్లిగూడెం రైల్వే ఎస్‌ఐ జి. శ్రీహరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.