చెన్నై నగరంలోని అరుంబాక్కం ప్రాంతంలో జరిగిన ఒక సాహసోపేత సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఓ బాలుడు విద్యుత్ షాక్కు గురయ్యాడు. వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలిచిపోయింది. అదే సమయంలో అక్కడ ఓ కరెంట్ తీగ నీటిలో పడిపోయింది. ఆ నీటిలో అడుగుపెట్టిన చిన్నారి ర్యాన్ ఒక్కసారిగా కదలకుండా పడిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఓ యువకుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా తన ప్రాణాలకే తెగించి ఆ బాలుడిని రక్షించాడు.
ఈ ఘటన ఏప్రిల్ 16న చోటుచేసుకోగా, శనివారం ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. చిన్నారి పేరు కజాడెన్ ర్యాన్ (9) కాగా, అతను మూడో తరగతిలో చదువుతున్నాడు. ర్యాన్ విద్యుత్ షాక్తో నీటిలోనే పడిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న 24 ఏళ్ల కన్నన్ తమిజ్సెల్వన్ అన్న యువకుడు ఇది గమనించి వెంటనే బాలుడిని బయటకు లాగాడు.
తర్వాత వెంటనే ర్యాన్కు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడగలిగాడు. ఇది చూసిన వారు కన్నన్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నెటిజన్లు ఆయనను ‘రియల్ హీరో’గా అభివర్ణిస్తున్నారు. “ఇలాంటి సమయస్ఫూర్తి, ధైర్యం ఉన్న వాళ్లు చాలా అరుదు” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా నిర్లక్ష్యంగా ఉన్న మున్సిపాలిటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తమిళనాడులో కూడా సెల్వన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రభుత్వ స్థాయిలో కూడా అతడికి ప్రత్యేకంగా గౌరవం ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ప్రజలు అంతా ఈ వీడియోను చూసి షాక్ అయినా… చివరికి అతడి సాహసానికి మన్ననలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ సమయంలో తీసుకున్న మంచి నిర్ణయం వల్ల ఒక చిన్నారి ప్రాణం నిలిచిందంటే, ఆ క్షణం నిజంగానే ఎంతో గొప్పది.