యాత్ర 2.. ఎమోషనల్ స్టార్ట్!

సాధారణంగా బయోపిక్ సినిమాలు అంటే ఓ వ్యక్తి చిన్నప్పటి నుంచి చివరి అంఖం వరకూ మొత్తం పరిగణలోకి తీసుకుంటారు. కానీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ఆధారంగా తీసిన సినిమా యాత్రలో మాత్రం కేవలం ఆయన రాజకీయ జీవితాన్ని చూపించారు. అది కూడా ఆయన పాదయాత్ర చేసిన పార్ట్ నుంచి సీఎం అయ్యే వరకు చూపించారు. మ‌హి.వి. రాఘ‌వ్ రూపొందించిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి వైఎస్ పాత్ర‌లో న‌టించారు.

2019, ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌లైన ఈ సినిమా అప్ప‌టి ఎన్నిక‌ల్లో వైసీపీ గెలవడానికి అంతో ఇంతో సహాయపడిందనే చెప్పాలి.2019 ఎన్నిక‌ల‌ని టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని విడుద‌ల చేశారు. మ‌ళ్లీ అదే ప్లాన్ తో `యాత్ర 2`కు శ్రీ‌కారం చుడుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. 2024 ఎల‌క్ష‌న్స్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేఫ‌థ్యంలో `యాత్ర 2`ని తెర‌పైకి తీసుకురావాల‌ని ద‌ర్శ‌కుడు మ‌హి.వి. రాఘ‌వ‌న్ ప్లాన్ చేస్తున్నారు.

`యాత్ర‌` వైఎస్ పాద‌యాత్ర నేఫ‌థ్యంలో సాగితే .. `యాత్ర 2`ను వైఎస్ జ‌గ‌న్ ప్ర‌ధానంగా సాగుతుంద‌ని తెలుస్తోంది. ఇందులో వైఎస్ జ‌గ‌న్ పాత్ర‌లో త‌మిళ న‌టుడు జీవా న‌టించ‌నున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.కాగా, తాజాగా దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కావడంతో, ఈ యాత్ర 2 మోషన్ పోస్టర్ ని విడుదల చేయడం విశేషం. దివంగత వైఎస్ వాయిస్ తో వీడియో మొదలైంది. తర్వాత జగన్ నేను ఉన్నాను, నేను విన్నాను డైలాగ్ తో వీడియో ఎండ్ అవ్వడం విశేషం.

ఇక మొదటి భాగంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో చూపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు యాత్ర 2లో జగన్ వైఎస్సార్ సీపీ ని స్థాపించడం దగ్గర నుంచి ఆయన పాదయాత్ర చేయడం, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవ్వడం వరకూ చూపిస్తారని తెలుస్తోంది. త్వరలోనూ మూవీ టీజర్, ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉంది.

ఇక ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూరుస్తున్నారు. మరి యాత్ర మాదిరిగానే ఈ మూవీ కూడా క్లిక్ అవుతుందో లేదో తెలియాలంటే, కొంత కాలం ఎదురు చూడాల్సిందే.