ఐసీసీ తాజా వార్షిక ర్యాంకింగ్స్ భారత్ అభిమానులకు మిశ్రమ భావోద్వేగాలను ఇచ్చాయి. టీమిండియా వన్డే, టీ20 ఫార్మాట్లలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా… టెస్టుల్లో మాత్రం నాలుగో స్థానానికి పడిపోయింది. మే 2024 తర్వాత ఆడిన మ్యాచ్లను ఆధారంగా తీసుకుని ఈ ర్యాంకులు ప్రకటించాయి.
వన్డేల్లో టీమిండియా తన పట్టు మరింత బలపరిచింది. ఇటీవల గెలిచిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజయంతో రేటింగ్ పాయింట్లు 122 నుంచి 124కు పెరిగాయి. దీంతో భారత్ టాప్లో నిలవగా, రన్నరప్ న్యూజిలాండ్ 111 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (108) మూడో స్థానంలో ఉన్నది.
టీ20ల్లోనూ భారత జట్టు దూకుడు తగ్గలేదు. 266 రేటింగ్ పాయింట్లతో భారత జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (256), ఇంగ్లండ్ (254), న్యూజిలాండ్ (250), వెస్టిండీస్ (248) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు షార్ట్ ఫార్మాట్లలో భారత ఆటగాళ్ల ప్రదర్శన నిలకడగా ఉండడం ర్యాంకుల్లో ప్రతిఫలించిందని చెప్పొచ్చు.
అయితే టెస్టుల్లో మాత్రం భారత జట్టు వెనకడుగు వేసింది. ఇప్పటివరకు 105 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఆస్ట్రేలియా (126) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, ఇంగ్లండ్ (113), దక్షిణాఫ్రికా (111) జట్లు రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది టీమిండియా కొన్ని కీలక మ్యాచ్లు కోల్పోవడంతోనే పాయింట్లు తగ్గాయని విశ్లేషకుల అభిప్రాయం. టెస్టు చాంపియన్షిప్ను దృష్టిలో ఉంచుకుని భారత్ పునరాగమనానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.