Jasprit Bumrah: చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు షాక్.. బుమ్రా దూరం.. ఫైనల్ టీమ్ రెడీ!

భారత జట్టుకు చాంపియన్స్ ట్రోఫీ ముందు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వెన్ను నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నీకి అందుబాటులో ఉండడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడంతో అతన్ని జట్టులో కొనసాగించకుండా సెలక్టర్లు కొత్త ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు. చివరకు యువ పేసర్ హర్షిత్ రాణాకు చోటు దక్కింది. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా గతంలోనూ బుమ్రా ఎన్నో మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు మరోసారి అతని గాయం తిరగబెట్టడం భారత బౌలింగ్ విభాగానికి పెద్ద దెబ్బగా మారింది.

జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో గాయపడిన బుమ్రా, అప్పటి నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. వైద్య బృందం అతను పూర్తి స్థాయిలో కోలుకోలేదని తేల్చడంతో, బోర్డు అతన్ని తప్పించాలని నిర్ణయించింది. గాయం పూర్తిగా నయం కాకుండా బుమ్రా మళ్లీ ఆడితే, తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టోర్నమెంట్‌ నాటికి కోలుకుంటాడని భావించిన బీసీసీఐ చివరకు కొత్త బౌలర్ ఎంపిక చేసే దిశగా అడుగులు వేసింది.

బుమ్రా గైర్హాజరుతో భారత జట్టు ప్రణాళికలు మారనుండటం ఖాయం. అతని యార్కర్లు, వేగం, డెత్ ఓవర్లలో అతడు చూపే ప్రభావం టీమిండియాకు ఎంతో అవసరమైనవి. అయితే, హర్షిత్ రాణాకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం దక్కింది. అతను పెద్ద టోర్నీలో ఎలా రాణిస్తాడనేదే ఆసక్తికరంగా మారింది. బుమ్రా అయితే మార్చి నుంచి ఐపీఎల్‌కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

భారత జట్టులో తాజా మార్పుల తర్వాత అంచనా వేయబడిన జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. ఈ మార్పులు భారత జట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి.

Janasena Kiran Royal Audio Leak | Kiran Royal Lakshmi | Pawan Kalyan | AP POlitics | Telugu Rajyam