కారవాన్ లో కూర్చోవాలంటే గుహలో కూర్చున్నట్టు అనిపించేది: విజయశాంతి

లేడీ అమితాబ్.. వెండితెర రాములమ్మగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలతో పాటు సమానంగా ఎన్నో చిత్రాలలో నటించిన విజయశాంతి గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈమె నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఇకపోతే ఈ సినిమా అనంతరం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ మేము హీరోయిన్ గా చేసే సమయంలో మాకు ఎలాంటి కారవాన్ లేవు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి హీరో హీరోయిన్ ల వరకు ప్రతి ఒక్కరూ సెట్లో కూర్చుని సరదాగా మాట్లాడుతూ అక్కడే అందరం భోజనం చేసేవాళ్ళం. ఇలా అందరితో కలిసి గడపడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క హీరో హీరోయిన్ కు కారవాన్ సదుపాయం ఉంది.

ఇక షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన వెంటనే వెళ్లి కార వాన్ లో కూర్చుని గంటలు గంటలు అక్కడే సమయం గడుపుతుంటారు. మిగతా టీంతో తమకేమీ సంబంధం లేదు అన్నట్టుగా అక్కడే కూర్చుని భోజనం కూడా అక్కడే చేస్తూ ఉంటారు. తనకు మాత్రం కారవాన్ లో అలా కూర్చోవడం ఏమాత్రం నచ్చదని,అలా గంటల తరబడి కారవాన్ లో కూర్చుంటే తనకి ఏదో ఒక గుహలో బంధించినట్టు ఉంటుందని అందుకే తనకు కారవాన్ అంటే నచ్చదని విజయశాంతి తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు.ఏదో మేకప్ చేసుకోవడానికి డ్రెస్ మార్చుకోవడానికి అయితే ఓకే కానీ ఇలా గంటల పాటు అందులో కూర్చోవడం తనకు ఏమాత్రం ఇష్టం ఉండదని విజయశాంతి తెలియజేశారు.