టాలీవుడ్‌లో మ‌రో శుభ‌కార్యం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ లిరిసిస్ట్‌

ఈ ఏడాది టాలీవుడ్‌లో వ‌రుస పెళ్లిళ్లు జ‌రుగుతున్నాయి. లాక్ డౌన్ స‌మ‌యంలో దిల్ రాజు మొద‌లు పెట్ట‌గా, ఆ త‌ర్వాత నిఖిల్, నితిన్, రానా, కాజ‌ల్ ఇలా ప‌లువురు నటీన‌టులు ద‌ర్శ‌క నిర్మాత‌లు, ర‌చ‌యిత‌లు పెళ్లి పీట‌లెక్కారు. తాజాగా స్టార్ లిరిసిస్ట్ శ్రీమ‌ణి త‌ను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడాడు. శ్రీమ‌ణి..సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘100% లవ్’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ సినిమాలో ‘ఏ స్క్వేర్ బీ స్క్వేర్’, ‘అహో బాలు’, ‘దటీజ్ మహాలక్ష్మి’ పాటలను శ్రీమణి రాశారు.

ఎన్నో చిత్రాల‌కు అద్భుత‌మైన లిరిక్స్ అందిచిన శ్రీమ‌ణ‌కి సెగ సినిమాలోని వ‌ర్షం ముందుగా అనే పాట‌తో బ్రేక్ వచ్చింది. అక్క‌డ నుండి స్టార్ హీరోల సినిమాల‌కు కూడా లిరిక్స్ అందిస్తూ దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా త్రివిక్ర‌మ్ సినిమాల‌లో శ్రీమ‌ణి హ‌స్తం త‌ప్ప‌క ఉంటుంది. ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అజ్ఞాతవాసి’.. చిత్రాల‌లో ప‌లు పాటలు రాసారు శ్రీమ‌ణి. ఇక దేవి శ్రీ ప్రసాద్‌తోను అత‌నికి మంచి బాండింగ్ ఉంది. దేవి శ్రీ సంగీత సార‌ధ్యంలో రూపొందిన ప్ర‌తి సినిమాలో శ్రీమ‌ణి లిరిక్స్ త‌ప్ప‌క ఉంటాయి. రీసెంట్‌గా ‘ఉప్పెన’, ‘రంగ్‌దే’ సినిమాలకు శ్రీమణి సాహిత్యం అందించారు.

ప‌దేళ్ళుగా ఫ‌రా అనే అమ్మాయితో ప్రేమ‌లో ఉన్న శ్రీమ‌ణి పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. క‌రోనా నేప‌థ్యంలో కేవ‌లం కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ఈ పెళ్ళి జరిగింది. పెళ్ళికి సంబంధించిన ఫొటోల‌ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసిన శ్రీమ‌ణి.. నా స్వీట్ లిటిల్ ఏంజెల్‌కు నా జీవితంలోకి స్వాగతం చెబుతున్నాను. ఈ అద్భ‌త‌మైన క్ష‌ణం కోసం ప‌దేళ్ళుగా వేచి చూస్తున్నాం. ఇన్నాళ్ళ‌కు మా క‌ల నిజ‌మైంది. మా మ‌న‌సుల‌ని అర్ధం చేసుకున్న దేవుడికి, త‌ల్లిదండ్రుల‌కి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను అని శ్రీమ‌ణి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. శ్రీమ‌ణికి దేవిశ్రీ ప్ర‌సాద్ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.