Krishnam Raju: ప్రభాస్‌ నెక్స్ట్ రిమేక్ సినిమా అదేనా…హింట్ ఇచ్చిన కృష్ణంరాజు!

Krishnam Raju: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, అందాల భామ పూజా హెగ్దే జంటగా నటించిన రాధేశ్యామ్ ఇటీవలే రిలీజ్ కావడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దాదాపు 3ఏళ్ల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న తమ అభిమాన హీరో సినిమా విడుదల కావడంతో పాలాభిషేకాలు చేస్తూ, టపాసులు కాలుస్తూ తమ ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రస్తుతం మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు కృష్ణంరాజు కూడా నటించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.

చాలా కాలం తర్వాత సినిమాల్లో నటించిన కృష్ణంరాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను రాధేశ్యామ్ సినిమాలో పరమహంస అనే పాత్రను పోషించానని, ఆ క్యారెక్టర్‌లో తనను చూసిన ప్రభాస్‌ దేవుడిని చూసినట్టుగా ఉందన్న వ్యాఖ్యలు నిజంగా తనకు చాలా సంతోషాన్ని కలిగించాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సారి తన అమ్మాయి ప్రసీద కూడా ఈ సినిమాలో భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉందని కృష్ణంరాజు తెలిపారు.

ప్రభాస్‌కు సంబంధించి కృష్ణంరాజు రెగ్యులర్ గా మాట్లాడే అంశాల్లో ఒకటి భక్త కన్నప్ప రీమేక్. ఎప్పటికైనా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై భక్తకన్నప్ప సినిమాను ప్రభాస్ హీరోగా రీమేక్ చేస్తానంటూ ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించుకున్నారు కృష్ణంరాజు. ఈసారి దీనికి అదనంగా మరో పేరును కూడా ప్రస్తావించడం ఆసక్తిగా మారింది. ఇక ప్రభాస్‌ ఏ సినిమా రీమేక్‌ చేయాలని కోరుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు మనవూరి పాండవులు’అయితే బాగుంటుందని కృష్ణంరాజు తెలిపారు. అంతేకాకుండా ఇకనుంచి ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలు తీస్తాడని ఆయన స్పష్టం చేశారు