71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలుగు సినిమా రంగానికి పలు విభాగాల్లో ప్రతిష్టాత్మక అవార్డులు దక్కడం హర్షించదగిన విషయం అని అన్నారు. అవార్డు విజేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు.
ఈ విజయానికి దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్దిలకు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా, ఉత్తమ వి.ఎఫ్.ఎక్స్ చిత్రంగా నిలిచిన ‘హను-మాన్’ చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, వి.ఎఫ్.ఎక్స్ నిపుణులు, నిర్మాతకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ఇక, ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా నీలం సాయి రాజేష్ (బేబీ చిత్రం), ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ గాయకుడిగా పి.వి.ఎన్.ఎస్. రోహిత్ (బేబీ), ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్గా నందు పృథ్వీ (హను-మాన్), ఉత్తమ బాల నటిగా సుకృతివేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు) ఎంపికైనందుకు వారికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ అవార్డులు సినీ పరిశ్రమకు నూతనోత్సాహాన్ని కలిగిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాదు, జాతీయ ఉత్తమ నటులుగా ఎంపికైన షారుక్ ఖాన్, విక్రాంత్ మాస్సే, ఉత్తమ నటిగా శ్రీమతి రాణీ ముఖర్జీ, ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్ను అభినందిస్తూ పవన్ తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్లో పోస్ట్ చేశారు. భారతీయ సినీ రంగానికి ఇది గర్వకారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
