ప్రభాస్‌ సినిమాలో నిధి అగర్వాల్‌!?

‘రాజాసాబ్‌’ కోసం మళ్లీ రంగంలోకి దిగుతున్నారు కథానాయకుడు ప్రభాస్‌. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌ కథానాయికలు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవల హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించుకోగా.. తాజాగా నిధి అగర్వాల్‌ సెట్లోకి అడుగు పెట్టింది.

ఈ వారంలోనే ప్రభాస్‌ కూడా సెట్లోకి రానున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌లో భాగంగా వీళ్లిద్దరిపై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. హారర్‌ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యముందట. దీన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.