రౌడీ బేబి సాంగ్‌పై రాజుకున్న వివాదం.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న సాయి ప‌ల్లవి అభిమానులు

ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడా లేకుండా సంగీత ప్రియులంద‌రిని అల‌రించిన సాంగ్ రౌడీ బేబి పాట‌. సాయి ప‌ల్ల‌వి, ధ‌నుష్ జంట‌గా న‌టించిన మారి 2 చిత్రం కోసం యువ‌న్ శంక‌ర్ రాజా ఈ పాటని స్వ‌ర‌ప‌రిచారు. రీసెంట్‌గా ఈ పాట 100 కోట్ల వ్యూస్‌ని రాబ‌ట్టి అంద‌రికి షాకిచ్చింది. సౌతిండియాలోనే ఈ ఘనత సాధించిన తొలి పాటగా రౌడీ బేబి పాట‌ రికార్డు నెలకొల్పగా చిత్ర బృందానికి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు నెటిజ‌న్స్.

ఇంత‌టి సంతోష‌క‌ర‌మైన వార్త‌ని మారి 2 టీం పోస్ట‌ర్ ద్వారా షేర్ చేసుకోగా, ప్ర‌స్తుతం ఇది వివాదంలో ప‌డింది. మారి 2 లోని రౌడీ బేబి సాంగ్‌కు అంత రెస్పాన్స్ రావ‌డం ధ‌నుష్‌తో పాటు సాయి ప‌ల్ల‌వి వేసిన స్టెప్స్ కూడా. ధ‌నుష్‌కు పోటీగా సాయి ప‌ల్ల‌వి స్టెప్పులు వేయ‌గా, వీరి డ్యాన్స్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. రౌడీ బేబి సాంగ్‌కు అంత మంచి రెస్పాన్స్ రావ‌డం ప‌ట్ల సాయి ప‌ల్ల‌వితో పాటు ఆమె అభిమానుల పాత్ర కూడా తప్ప‌క ఉంది. అయితే ఇప్పుడు చిత్ర సంస్థ వారిని అగౌర‌వ‌ప‌రిచింద‌నే వివాదం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

వండ‌ర్ బార్ ఫిలింస్ సంస్థ మారి 2 చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌గా, ఇందులో కేవ‌లం ధ‌నుష్ ఫొటో మాత్ర‌మే ఉంది. పాట స‌క్సెస్‌లో స‌గ‌భాగం అయిన సాయి ప‌ల్ల‌విని ఎందుకు సైడ్‌కు నెట్టారు అంటూ అభిమానులు మండిప‌డుతున్నారు. సాయిప‌ల్ల‌వి స‌త్తాని చూసి ఆమెను అణ‌గ‌దొక్కేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కామెంట్స్ వ‌స్తున్నాయి. దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.