15 రోజులు తిండి లేకుండా అవకాశాల కోసం కష్టపడిన సీనియర్ నటుడు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన కైకాల సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. నెగిటివ్ రోల్స్, పాజిటివ్ రోల్స్ ఏ పాత్రకైనా జీవం పోసి నటించే ఈ ప్రముఖ నటుడు సినిమా అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. నాటకాలు ప్రదర్శించే సత్యనారాయణ గారిని ఎంతోమంది ప్రముఖులు మద్రాస్ కి పిలిచి డిగ్రీ పూర్తి అయ్యాక సినిమా ఛాన్సులు ఇస్తామని చెప్పారు. కానీ సినిమా షూటింగ్ ఎప్పుడో చెప్పేవారు కాదట. ఒక సందర్భంలో కేవీ రెడ్డి గారు ఈయనకు అవకాశం ఇస్తారని చెప్పి రెండు రోజులు తర్వాత రమ్మని చెప్పగా సంక్రాంతి పండుగ కోసం ఊరు వెళ్లిన సత్యనారాయణ తిరిగి వచ్చేసరికి ఆ పాత్ర చేజారిపోయింది.

అలా చేతిలో ఉన్న అవకాశాన్ని వదులుకొని మళ్ళీ సినిమాలో అవకాశాల కోసం 15 రోజులపాటు మద్రాసులో తిండి తిప్పలు లేకుండా ఆఫీసులో చుట్టూ తిరుగుతూ రోడ్డుమీద దొరికినవి తింటూ పార్కులో నిద్రపోయేవాడు. ఇలా అవకాశాలు లేక ఇంటికి తిరిగి వెళితే తన పరువు పోతుందని భావించి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట. కానీ సిపాయి కూతురు సినిమాలో ఈయనకి మొదటి అవకాశం దక్కింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో ఎన్టీఆర్ కి డూప్ గా కూడా నటించాడు. ఏఎన్నార్, ఎస్వీఆర్, ఎన్టీఆర్ హీరోలుగా ఉన్న సమయంలో నవరసాలు పండించగల నటుడు అని అనిపించుకున్నారు .

సత్యనారాయణ గారికి ఎప్పుడూ విలన్ రోల్స్ ఇచ్చేవారట. ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత ప్రతి సినిమాలోను సత్యనారాయణ విలన్ పాత్రలో కనిపించేవాడు. ఇలా ఇప్పటివరకు ఈయన దాదాపు 800 కు పైగా సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించాడు. ముఖ్యంగా యముడి పాత్ర అంటేనే మొదట గుర్తు వచ్చే పేరు కైకాల సత్యనారాయణ. ఆ పాత్రకు సత్యనారాయణ గారు జీవం పోసి నటించేవారు. అయితే ఇలా ఇన్ని సంవత్సరాలుగా 800 కు పైగా సినిమాలలో వివిధ పాత్రలలో నటించిన ఏకైక నటుడిగా సత్యనారాయణ గుర్తింపు పొందారు. అయితే ఒకానొక సమయంలో రాజకీయాలలో ప్రవేశించి మచిలీపట్నం ఎంపీగా ప్రజలకు సేవలు అందించిన ఈయన తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పి పూర్తిగా తన జీవితాన్ని సినిమాలకు అంకితం చేశాడు.