భారత క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయే పేరు పీయూష్ చావ్లా. టీనేజ్లోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి, రెండు వరల్డ్కప్ల జట్లలో భాగమైన ఈ లెగ్ స్పిన్నర్… ఇప్పుడు తన ప్రయాణానికి ముగింపు పలికాడు. 36 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. “ఇది నాకు భావోద్వేగ భరితమైన క్షణం. భారత జట్టులో చోటు దక్కడం, ప్రపంచకప్లు గెలిచిన జట్టులో భాగమవడం నా జీవిత గౌరవం” అంటూ ఆయన తెలిపాడు.
చావ్లా 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి, 2012 వరకు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 3 టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20 మ్యాచ్ల్లో 43 వికెట్లు తీసి తన పాత్రను చక్కగా పోషించాడు. కానీ చావ్లాకు నిజమైన గుర్తింపు ఐపీఎల్ నుంచే లభించింది. పంజాబ్, కోల్కతా, చెన్నై, ముంబై వంటి టాప్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ స్పిన్నర్, ఐపీఎల్లో మొత్తం 192 వికెట్లు తీశాడు.
చివరి రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న చావ్లా, 2014లో కోల్కతా నైట్ రైడర్స్కి టైటిల్ అందించిన జట్టులో కీలక సభ్యుడిగా నిలిచాడు. “ఐపీఎల్ నా కెరీర్లో మర్చిపోలేని అధ్యాయం. ప్రతి సీజన్ నాకు కొత్తగా నేర్పింది. నాకు నమ్మకాన్ని ఇచ్చిన ప్రతి ఫ్రాంచైజీకి ధన్యవాదాలు” అని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నాడు.
తన ఎదుగుదల వెనక ఉన్న కోచ్లు, కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ముఖ్యంగా తన తండ్రి పాత్రను గుర్తు చేసుకుంటూ, “ఆయన ఆశీర్వాదం లేకుండా ఈ ప్రయాణం అసాధ్యమే” అంటూ భావోద్వేగంతో రాసిన లైన్లు అభిమానుల హృదయాల్ని తాకుతున్నాయి. ఇకపై క్రికెట్ను మిస్ అవుతానని చెప్పిన చావ్లా… తన తరువాతి దశలో ఏ విధంగా కొనసాగుతాడో ఆసక్తికరంగా మారింది.