భారత క్రికెట్ జట్టును వరుసగా నాలుగు ఐసీసీ ఫైనల్స్కు చేర్చిన తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (2023), వన్డే వరల్డ్ కప్ (2023), టీ20 వరల్డ్ కప్ (2024), తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ (2025) ఫైనల్కు భారత్ను తీసుకెళ్లడం ద్వారా తన సారథ్య నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు భారత్ రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు గెలుచుకోగా, రోహిత్ నాయకత్వంలో మూడో టైటిల్ సాధిస్తే, భారత క్రికెట్లో మరొక గొప్ప అధ్యాయం రికార్డవుతుంది.
ఈ ఘనత సాధించిన మొదటి భారత కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనీ 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీల్లో జట్టును విజేతగా నిలిపినప్పటికీ, టెస్ట్ ఛాంపియన్షిప్ అప్పట్లో లేకపోవడంతో ఆ ఫార్మాట్లో ధోనీకి ఈ చరిత్ర సృష్టించే అవకాశం రాలేదు. కానీ, రోహిత్ మాత్రం అన్ని ఫార్మాట్లలో టీమిండియాను ఫైనల్కు చేర్చి కెప్టెన్సీ పరంగా తన ప్రత్యేకతను చాటాడు.
2023లో వన్డే ప్రపంచ కప్ ఫైనల్, టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ఓడినా, 2024 టీ20 వరల్డ్ కప్ను గెలిచి రోహిత్ తన నాయకత్వాన్ని మరింత ప్రభావంతంగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ను కూడా భారత్ గెలిస్తే, భారత క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ అత్యుత్తమ కెప్టెన్ల జాబితాలో చోటు సంపాదించుకునే అవకాశం ఉంది.
అంతర్జాతీయ క్రికెట్లో భారత్ను విజయాల బాటలో నడిపిస్తున్న రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ విజయం టీమిండియా స్ధిరత్వానికి, భవిష్యత్ విజయం లక్ష్యంగా ముందుకు సాగేందుకు దోహదం చేస్తుంది. ఇప్పుడు రోహిత్ సేన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గెలిచి మరో బంగారు పేజీని లిఖిస్తే, భారత క్రికెట్కు ఇది మరింత శక్తినిచ్చే మైలురాయి కానుంది.


