ఈ ఆనందాన్ని ఎప్పటికీ మరిచిపోను : కంగనా రనౌత్‌ !

చెడుపై మంచి గెలిచిన ప్రతీకగా దసరా ఉత్సవాల్లో రావణ దహనం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఢిల్లీలోని రామ్‌ లీలా మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ప్రధాన మంత్రి చేతులమీదుగా ఈ తంతు జరుగుతుంటుంది.

అయితే ఈ ఏడాది బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. 50 ఏళ్ల చరిత్రలో ఓ మహిళ సెలబ్రిటీ ఈ కార్యక్రమానికి వెళ్లి రావణ దహనం చేయడం ఇదే మొదటిసారి. మంగళవారం సాయంత్రం ఈ రావణ దహనం జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు.

తాజాగా మహిళా బిల్లును పార్లమెంట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి రావణ్‌ దహన్‌ కార్యక్రమానికి రామ్‌లీల కమిటీ కంగనాను ఆహ్వానించింది. ఆమెతో పాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ కంగనా ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ‘50 ఏళ్ల నుంచి వేడుక జరుగుతుంది. కానీ, రావణ్‌ దహన్‌ వేడుకను ఓ మహిళ చేయడం ఇదే మొదటిసారి. ఆ అవకాశం నాకు లభించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని చెప్పారు.

తాజాగా ఆమె నటించిన తేజస్‌ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సర్వేశ్‌ మేవారా దర్శకత్వం వహించారు. 2016లో భారత వైమానిక దళం క్షేత్రస్థాయి పోరాటా విధానాల్లోకి మొట్టమొదటిసారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించారు.