పారితోషికం కన్నా… పాత్ర ముఖ్యం: కరీనా కపూర్‌ స్పందన

బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల జాబితాలో భాగం కావడంపై స్పందించారు. డబ్బు కంటే పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ‘దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకూ సంపాదిస్తున్న తారల్లో నేనూ ఒకదాన్ని. ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించా. కేవలం పారితోషికాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమాలు అంగీకరించను. పాత్ర నచ్చితే తక్కువ రెమ్యూనరేషన్‌కూ యాక్ట్‌ చేస్తా. అది పూర్తిగా నా అభిప్రాయం విూద ఆధారపడి ఉంటుంది.

సినిమా ఎలాంటిది? అందులో నా పాత్ర ఏమిటి? అది సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటా‘ అని చెప్పారు. అనంతరం తన భర్త సైఫ్‌ అలీఖాన్‌ గురించి మాట్లాడారు. ‘పెళ్లి తర్వాత ఎంతో మారా. ఒకరికొకరు తోడుగా ఉండటం అర్థం చేసుకున్నాం. షూటింగ్స్‌ కారణంగా కలిసి టైమ్‌ స్పెండ్‌ చేయడానికి వీలు ఉండదు. ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఒకరినొకరు చూసుకోవడానికి కూడా సమయం దొరకదు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను బ్యాలెన్స్‌ చేయడం అంత సులభం కాదు. అందుకే వీలు దొరికినప్పుడు కలిసి సరదాగా గడపాలనుకుంటాం‘ అని తెలిపారు.

’క్రూ’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు కరీనాకపూర్‌. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో జాస్మిన్‌ కోహ్లిగా కనిపించారు. ప్రస్తుతం ఈమె ’సింగం అగైన్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు.