జీవితంలో కొన్ని త్యాగాలు తప్పవు: జాన్వీ

”జీవితంతో కొన్ని సాధించాలంటే కొన్ని త్యాగాలు చేయాలి, సవాళ్లను ఎదుర్కొవాలి, అలాగే అభిమానులు, ప్రేక్షకులను మెప్పించాలంటే కథానాయికగా బలమైన కథలు ఎంచుకోవాలి. వాటితో ప్రేక్షకులను మెప్పించాలి. అందుకోసం చాలా కష్టపడాలి” అంటున్నారు బాలీవుడ్‌ యువ కథానాయిక జాన్వీకపూర్‌. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ చిత్రం కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు. రాజ్‌కుమార్‌ రావ్‌తో కలిసి ఆమె నటించిన చిత్రమిది. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కింది.

ఈ చిత్ర ప్రమోషన్స్‌ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షూటింగ్‌ టైమ్‌లో ఎదుర్కొన్న సవాళ్లను గురించి చెప్పుకొచ్చింది. ఈ సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడి క్రికెట్‌ నేర్చుకున్నాను. దర్శకుడు శరణ్‌ శర్మ ఏ పనిలోనైనా నాణ్యతని కోరుకుంటారు. క్రికెట్‌ నేపథ్యంలో కథ కాబట్టి నేను తప్పక క్రికెట్‌ నేర్చుకోవాలని పట్టుబట్టారు. ఎలాంటి వీఎఫ్‌ఎక్స్‌ ఉపయోగించకూడదన్నారు. శిక్షణ సమయంలో ఎన్నో దెబ్బలు తగిలాయి. భుజాలు డిస్‌లొకేట్‌ అయ్యాయి. ఈ చిత్రాన్ని వదిలేద్దామని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నేను క్రికెట్‌ ఆడగలనని నాలో ధైర్యం నింపింది శిక్షకులు అభిషేక్‌ నాయర్‌, నాయర్‌, విక్రాంత్‌ సర్‌ మాత్రమే’ అని అంది.

సినిమా ప్రమోషన్‌ లో ఆరు నంబరు కలిగిన దుస్తుల్ని మాత్రమే ఎందుకు ధరిస్తున్నారు అన్న ప్రశ్నకు.. ‘ఈ సినిమాలో నేను పోషించిన మహిమ పాత్ర క్రికెట్‌ ఆటలో ఆరు నంబరు గల జెర్సీనే ధరిస్తుంది. ఆమె ధోనీకి వీరాభిమాని. మేము కూడా షూటింగ్‌ సమయంలో ధోని ధరించే ఏడు నంబరు జెర్సీనే ఉపయోగించాలనుకున్నాం. కానీ ఆ నంబరు ఆయనకు మాత్రమే సొంతం అనుకొని ఆరుని నిర్ణయించాం. అంతేకాదు ఆరు నా లక్కీ నంబరు కూడా. ఈ సినిమాకు కూడా ఆ అదృష్టం కలిసిరావాలని ఆశిస్తున్నా’ అని చెప్పారు జాన్వీ. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ప్రస్తుతం జాన్వీ రెండు తెలుగు చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’, రామ్‌చరణ్‌-బుచ్చిబాబు సాన కాంబోలో వస్తున్న చిత్రంలోనూ నటిస్తోంది.