ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కబోయే ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల బన్నీ బర్త్డే స్పెషల్గా విడుదలైన వీడియోలో సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఉండబోతున్నట్టు స్పష్టమైంది. లాస్ ఏంజెల్స్లోని టాప్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో పని చేయడం దీనికి నిదర్శనం.
ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ బయటకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్లో ముగ్గురు హీరోయిన్స్ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారని సమాచారం. ఇప్పటికే మృణాల్ ఠాకూర్ని ఓ కీలక రోల్ కోసం ఎంపిక చేసినట్టు టాక్ ఉంది. కథా చర్చలు ముగిసిన తర్వాత ముంబైలో లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని అంటున్నారు. మృణాల్ ఛాన్స్ దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది.
ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా బన్నీ-అట్లీ సినిమాతో జట్టు కట్టబోతోందని సమాచారం. ఇటీవల జాన్వీ కథ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆమెతో ఓవరాల్ అగ్రిమెంట్ పూర్తిచేసుకున్నట్టు వినికిడి. జాన్వీ కపూర్ పేరును అధికారికంగా ప్రకటించే తేదీ కూడా దగ్గరలోనే ఉన్నట్టు టాక్.
దీపికా పదుకొణెతో కూడా మేకర్స్ చర్చలు జరుపుతున్నారని సమాచారం. ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ఒకే ప్రాజెక్ట్లో కలిసి రావడం అభిమానులకు మేజర్ హైలైట్ కానుంది.