నటి శ్రీదేవి మృతిపై నకిలీ పత్రాలు.. యూట్యూబర్‌పై సిబిఐ ఛార్జిషీటు!

అలనాటి అందాల తార శ్రీదేవి మృతిపై నకిలీ పత్రాలు సృష్టించిన ఓ యూట్యూబర్‌పై ఛార్జిషీట్‌ దాఖలు చేసినట్లు సీబీఐ అధికారులు తాజాగా వెల్లడించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన దీప్తి అనే మహిళ తాను సోషల్‌ మీడియాలో ప్రమోట్‌ అయ్యేందుకు శ్రీదేవి మృతి అంశాన్ని వాడుకున్నట్లు తెలిపారు. శ్రీదేవి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దీప్తి.. సామాజిక మాధ్యమాల్లో అనేక చర్చలు జరిపింది.

ఆ సందర్భంగా ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. శ్రీదేవి మరణంపై తాను సొంతగా విచారణ జరిపినట్లు తెలిపింది. అందులో యూఏఈ, భారత్‌ ప్రభుత్వాలు నిజాలను దాచి పెట్టాయని ఆరోపించింది. తన వాదనలకు బలం చేకూర్చేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లేఖలతోపాటు, సుప్రీంకోర్టు, యూఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్లను చూపించింది.

దీంతో దీప్తిపై ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ షా.. సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆమె చూపిన పత్రాలన్నీ నకిలీవని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులో దీప్తి లాయర్‌ భరత్‌ సురేశ్‌ కుమార్‌ పేరును కూడా చేర్చారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో దీప్తి చూపిన ప్రధాని, రక్షణ మంత్రి లేఖలు నకిలీవని నిర్దారించారు. ఈ మేరకు ఆమెపై ఛార్జిషీట్‌ దాఖలు చేశారు.

మరోవైపు సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేయడంపై దీప్తి స్పందించారు. తన వాంగ్మూలం నమోదు చేయకుండా సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తనపై మోపిన అభియోగాలకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టుకు అందజేస్తానని చెప్పారు.

కాగా, ఈ అంశంలో దీప్తిపై గతేడాది సీబీఐ అధికారులు కేసు నమోదుచేశారు. డిసెంబరు 2న భువనేశ్వర్‌లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు.. దీప్తి ఫోన్‌, ల్యాప్‌టాప్‌ సహా పలు డిజిటల్‌ పరికరాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నటి శ్రీదేవి మరణంపై దీప్తి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, నకిలీ పత్రాలు సృష్టించారని కోర్టుకు సమర్పించిన నివేదికలో సీబీఐ పేర్కొంది. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి దుబాయ్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే.