IPL 2025: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ఐపీఎల్ 2025 సీజన్ భవిష్యత్తు తేలికైన విషయం కాదు. ఇప్పటికే 57 మ్యాచ్లు పూర్తవగా, 58వ మ్యాచ్ మధ్యలో నిలిచిపోయింది. బీసీసీఐ వారం రోజుల విరామం ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితులు చక్కబడకపోతే టోర్నీ రద్దు లేదా వేరే వేదికపై పూర్తి చేయాలన్న చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నుంచి వచ్చిన ప్రతిపాదన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
‘ది గార్డియన్’ పత్రిక కథనం ప్రకారం, ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ బీసీసీఐతో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించారని సమాచారం. టోర్నీ కొనసాగించడం భారత్లో సాధ్యం కాకుంటే, సెప్టెంబర్లో మిగిలిన 16 మ్యాచ్లను ఇంగ్లండ్లో నిర్వహించడానికి అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు చురుకైన చర్చలు లేకపోయినా, ఈ ప్రతిపాదన బీసీసీఐకి ఒక కీలక ఆప్షన్గా నిలుస్తుంది.
ఇది కొత్తదేమీ కాదు. 2009లో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ సౌతాఫ్రికా వేదికగా జరిగింది. అలాగే 2021లో కరోనా మహమ్మారి కారణంగా మధ్యలో నిలిచిన సీజన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో విజయవంతంగా పూర్తి చేశారు. కాబట్టి, బీసీసీఐకి విదేశీ వేదికల్లో టోర్నీ నిర్వహణలో అనుభవం ఉంది. కానీ ఇంగ్లండ్ వాతావరణం, ప్రేక్షకుల ఆసక్తి, ఖర్చులు, ప్రసార వేళలు.. ఇవి కసరత్తుగా మారే అంశాలు.
ఇప్పుడు అభిమానుల్లో ప్రధాన ఆందోళన టోర్నీని ఎక్కడ కొనసాగిస్తారు అనే దానిపైనే ఉంది. భద్రతా సమస్యలు భారత్లో ఉంటే, ఇంగ్లండ్ వేదికపై ఆటను పూర్తి చేయడమే సరైన ఆప్షన్ అని కొందరు భావిస్తున్నా, అక్కడి జనం క్రికెట్ పట్ల ఎంత ఆసక్తి చూపిస్తారో అనేది ప్రశ్నార్థకం. అంతేకాక, ప్లేయర్లు, సిబ్బంది వీసాలు, లాజిస్టిక్స్ ఇవన్నీ పెద్ద మానేజ్మెంట్ టాస్క్ అవుతాయి. ఇక ఐపీఎల్ 2025 భారత్లోనే పూర్తి అవుతుందా? లేక వేదిక మార్చి చరిత్ర సృష్టిస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.