‘రాజాసాబ్‌’ చిత్రీకరణలో ఆలస్యం!?

అగ్ర నటుడు ప్రభాస్‌ చాలా సినిమాలతో ఎంతో బిజీగా వున్నారు. ఒకపక్క ‘కల్కి 2898ఏడి’ ముగింపు దశలో వుంది. ఆ సినిమా కోసమని విదేశాలకు కూడా వెళ్లి వచ్చారు, ఇంకోపక్క ‘సలార్‌ 2’ షూటింగ్‌ కూడా చెయ్యాలి. ఈ రెండు సినిమాలు ఇలా ఉంటే ఇంకో సినిమా ‘ది రాజా సాబ్‌’ సినిమా కూడా చిత్రీకరణ ఎప్పుడో మొదలైంది. ఈ సినిమాకి మారుతి దర్శకుడు, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు. జనవరిలో ఈ సినిమా నుండి ప్రభాస్‌ మొదటి చిత్రాన్ని కూడా విడుదల చేసిన సంగతి కూడా తెలిసిందే.

ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ చాలా నత్త నడకగా సాగుతోందని పరిశ్రమలో టాక్‌ నడుస్తోంది. ఎందుకంటే సంజయ్‌ దత్‌ ఒకరోజు చిత్రీకరణలో పాల్గొంటే ఇంకో రోజు తనకి వొంట్లో బాగోలేదని చిత్రీకరణకు రావటం లేదని తెలుస్తోంది.

అదీ కాకుండా సంజయ్‌ దత్‌ కి సహాయకులుగా చాలామంది వున్నారని, వాళ్లందరికీ కూడా నిర్మాణ సంస్థ నుండే జీతాలు వెళతాయని అంటున్నారు. అందువలన అతను సరిగ్గా రాకపోవటంతో చిత్రీకరణకు అయ్యే ఖర్చు చాలా వృధా అవుతోందని, దీనివలన ఈ సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతోందని కూడా పరిశ్రమలో అనుకుంటున్నారు. సంజయ్‌ దత్‌ కి అత్యధిక పారితోషికంతో పాటు, అతను హైదాబారాబాదు నుండి ముంబై, మళ్ళీ తిరుగు ప్రయాణానికి ప్రత్యేక విమానం అతని కోసమని తీసుకున్నారని, దీనివల్ల కూడా ఈ సినిమా బడ్జెట్ ఎక్కువయిందని పరిశ్రమలో ఊహాగానాలు నడుస్తున్నాయి.

దర్శకుడు మారుతి కూడా సంజయ్‌ దత్‌ ఎప్పుడు చిత్రీకరణకు వస్తారా అని ఎదురుచూడటంతోటే సరిపోతోందని అనుకుంటున్నారు. ఇలా అయితే ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు పూర్తవుతుందో కూడా నిర్వాహకులకు అర్థం కాకుండా పోతోందని అంటున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌, మాళవిక మోహన్‌, రిద్ధి కుమార్‌ లు కథానాయకులుగా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్‌ మొదటిసారిగా ఒక హర్రర్‌ సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా నేపధ్యం హర్రర్‌ కామెడీ అని అంటున్నారు.