నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్‌ గా రాణించింది ఛార్మి. 2001లో వచ్చిన నీతోడు కావాలి తో ఛార్మి హీరోయిన్‌ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. 2004లో వచ్చిన శ్రీ ఆంజనేయం తో ఈ చిన్నది క్రేజ్‌ సొంతం చేసుకుంది. పేరుకు భక్తి చిత్రమే అయినా.. ఈ సినిమాలో ఛార్మి అందాలతో రెచ్చిపోయింది. గ్లామర్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది.

చాలా సినిమాల్లో నటించిన ఛార్మికి సాలిడ్‌ హిట్‌ మాత్రం పడలేదు. 2005లో జ్యోతిలక్ష్మీ అనే సినిమాలో నటించింది. డైనమిక్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటించింది ఛార్మి. ఇక ఇప్పుడు ఈ చిన్నది నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. పూరిజగన్నాథ్‌ తో కలిసి ఆమె కొన్ని సినిమాలను నిర్మించింది. ప్రస్తుతం పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌ శంకర్‌’ ను నిర్మిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఛార్మి ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ ను షేర్‌ చేసింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్‌ సెంథిల్‌ సతీమణి రూహి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న మధ్యాహ్నం కన్నుమూశారు. సెంథిల్‌ సతీమణి మరణ వార్త విని సినీ లోకం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. చాలా మంది సినీ సెలబ్రెటీలు ఆమె మృతికి సంతాపం తెలిపారు. చాలా మంది సెలబ్రెటీలకు రూహి యోగా నేర్పించారు. దాంతో ఆమెకు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులయ్యారు. వారిలో ఛార్మి ఒకరు. ఇక ఇప్పుడు రూహి మరణ వార్త విని ఛార్మి ఎమోషనల్‌ అయ్యారు.

ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ ను షేర్‌ చేశారు. ”నీ గురించి ఇలా నేను పోస్ట్‌ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. మై డియర్‌ రూహి.. నేను ఇప్పటికీ షాక్‌ లోనే ఉన్నాను.. నాకు మాటలు కూడా రావడం లేదు.. నీ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు కావాలని కోరుకుంటున్నాను.. మనం చివరగా కూడా ఎంతో సరదాగా, నవ్వుతూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం.. మనది 18 ఏళ్ల బంధం.. ఇక నిన్ను ఎప్పటికీ మిస్‌ అవుతాను.. నీ ఆత్మకు శాంతి కలగాలి’’ అంటూ ఎమోషనల్‌ అయ్యారు ఛార్మి.