నా సినిమాపై సెన్సార్‌ బోర్డు ఎమర్జెన్సీ : అసహనం వ్యక్తంచేసిన కంగనా రనౌత్‌!

కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎమర్జెన్సీ’ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం తాజాగా మరోసారి వారం రోజులు వెనక్కి వెళ్లింది. సెప్టెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకురావాల్సిన ఈ చిత్రం మరికొన్ని రోజులు ఆలస్యం కానుంది. ఈ సినిమాపై సెన్సార్‌ బోర్డు కొన్ని అభ్యంతరాలు చెప్పినట్లు తెలుస్తోంది.

తాజాగా దీనిపై కంగనా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అసహనం వ్యక్తంచేశారు. ’నా సినిమాపై కూడా ఎర్జెన్సీ విధించారు. ఇది చాలా విచారకరమైన పరిస్థితి. నేను నిరాశకు గురయ్యాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక సెన్సార్‌ బోర్డ్‌ను విమర్శిస్తూ.. ఓటీటీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ’దేశంలోని చట్టం ఏంటంటే.. ఓటీటీలో అయితే ఎటువంటి సెన్సార్‌ ఉండదు. అనూహ్యమైన హింసను, అశ్లీలతను ప్రదర్శించవచ్చు. రాజకీయంగా పలుకుబడి ఉంటే నిజజీవిత సంఘటనలను కూడా వక్రీకరించి సినిమాలు తీయొచ్చు. ఓటీటీల్లో అంత స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛలో కొంచెం కూడా మాలాంటి వాళ్లకు ఉండదు.

అందుకే భారతదేశ సమగ్రత, ఐక్యత చుట్టూ తిరిగే చిత్రాలను తీయడానికి మాకు అనుమతి ఉండదు. కొన్ని చిత్రాలు తీయడానికి మనలో కొంతమందికి మాత్రమే సెన్సార్‌షిప్‌ ఉంది. ఇది అన్యాయం’ అని పేర్కొన్నారు. తాను ఆత్మగౌరవంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. సెన్సార్‌బోర్డ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే తాను కోర్టులో పోరాడటానికైనా సిద్ధమేనన్నారు.