ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన యువ క్రికెటర్ శివాలిక్ శర్మ ఇప్పుడు అత్యాచార ఆరోపణలతో చిక్కుల్లో పడ్డాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు సమాచారం. 26 ఏళ్ల శివాలిక్ గతంలో బరోడా క్రికెట్ జట్టు తరపున రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు.
శివాలిక్కు సంబంధించి బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా పరిచయమై, ప్రేమలో పడ్డారు. అనంతరం నిశ్చితార్థం జరిపి, వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడని తెలిపింది. అయితే పెళ్లి సమయం దగ్గరపడిన తరువాత, అతడు మాట తప్పుతూ మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి నెపంతో శారీరక సంబంధానికి ఒప్పించాడని, తర్వాత తనను దూరం పెట్టేందుకు ప్రయత్నించాడని వెల్లడించింది.
ఈ మేరకు యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జోధ్పూర్ పోలీసులు ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. శివాలిక్ను వడోదరలో అదుపులోకి తీసుకుని, విచారణ అనంతరం జోధ్పూర్కి తరలించారు. అక్కడ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు జ్యుడీషియల్ కస్టడీ కోరగా, న్యాయస్థానం అంగీకరించింది.
క్రీడారంగంలో మంచి ప్లేయర్గా ఎదుగుతున్న సమయంలో, శివాలిక్ పై వచ్చిన ఈ ఆరోపణలు అతడి కెరీర్కు పెద్ద దెబ్బ తీరేలా కనిపిస్తున్నాయి. 2023 ఐపీఎల్ సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో చోటు దక్కించుకున్న అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తరువాత ఏ టీమ్ కూడా అతనిపై ఆసక్తి చూపలేదు. ఇక ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో జరిగిన వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ కేసు క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది.