భారత్-పాక్ సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ అత్యవసరంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం క్రికెట్ అంచనాలకూ దెబ్బతీసింది. బోర్డు నిర్ణయానికి ప్రధాన కారణం భద్రతా పరిస్థితులు అని స్పష్టమవుతోంది. దేశం మొత్తం ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి సమయంలో ఆటగాళ్లతోపాటు ప్రేక్షకుల భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని బీసీసీఐ భావించింది.
గత కొన్ని రోజులుగా సరిహద్దు వద్ద పాక్ వైపు నుంచి రెచ్చగొట్టే చర్యలు పెరిగిన వేళ, విదేశీ ఆటగాళ్ల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు సీనియర్ ప్లేయర్లను వెనక్కి పిలుచుకోవాలని ఆలోచిస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో బోర్డు ఆధ్వర్యంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఐపీఎల్ను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు.
ఐపీఎల్ వాయిదా దేశీయ క్రికెట్, వ్యాపార పరంగా పెద్ద దెబ్బే అయినా, జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యల్లో బీసీసీఐ రాజీ పడకూడదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సవాళ్లు ఎంతటి కైనా దేశం ముందు ఏ ఆటా, ఆర్థిక లాభాలూ ముఖ్యంకాదు అనే సూత్రాన్ని బోర్డు ప్రదర్శించినట్లు పలువురు విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి బోర్డు నుంచి ‘మళ్ళీ ప్రారంభం ఎప్పుడు?’ అనే ప్రశ్నకు సమాధానం రాలేదు. పరిస్థితులు చక్కబడితేనే తదుపరి షెడ్యూల్ ప్రకటన చేస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.