పహల్గామ్లోని బైసరన్ వ్యాలీ వద్ద మంగళవారం జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమాయక పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని మతాన్ని అడిగి మరీ కాల్చిచంపిన ఘోర ఘటనపై ప్రతి భారతీయుడు స్పందిస్తున్నాడు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని స్వదేశానికి రావడం, సరిహద్దుల్లో ఆర్మీ చర్యలు మొదలుపెట్టడం వంటి పరిణామాలు సీరియస్ గా మారుతుండగా… ఇప్పుడు ఈ ఘటన ప్రభావం బాలీవుడ్కు కూడా చేరింది.
పాక్ నటుడు ఫవద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ అనే బాలీవుడ్ సినిమా మే 9న విడుదల కావాల్సి ఉంది. వాణీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ ప్రేమకథా చిత్రం ట్రైలర్తోనే ఓ మోస్తరు బజ్ తెచ్చుకుంది. కానీ పహల్గామ్ దాడి తర్వాత ఈ సినిమా విడుదలపై భారీ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘‘మన దేశం మీదే పాకిస్థాన్ దాడులు చేస్తుంటే, వాళ్ల నటులకు మళ్లీ వేదికలు ఎందుకు?’’ అనే ప్రశ్నలు నెటిజెన్ల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
ఫవద్ ఖాన్ గతంలో ఖూబ్సూరత్, ఏ దిల్ హై ముష్కిల్ వంటి హిందీ చిత్రాల్లో కనిపించి ఓ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పుల్వామా దాడి తర్వాత పాక్ నటులపై వచ్చిన నిషేధం కారణంగా తిరిగి హిందీ చిత్రాల్లో కనిపించలేదు. ఇప్పుడీ అబీర్ గులాల్తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న తరుణంలో జరిగిన ఈ ఉగ్రదాడి, అతడిపై అభ్యంతరాలు మళ్లీ తెరపైకి తెచ్చాయి.
ప్రస్తుతం ట్విట్టర్లో #BanAbirGulaal హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశముందని బాలీవుడ్ వర్గాల చెబుతున్నాయి. ఫవద్ ఖాన్ ఇప్పటివరకూ ఈ దాడిపై స్పందించకపోవడం కూడా ఈ నిరసనల్ని మరింత తీవ్రతరంగా మార్చేలా చేస్తోంది.