IPL 2025: భారత్-పాక్ ఉద్రిక్త పరిస్థితులు.. ఐపీఎల్ పై అనుమానాలు..?

IPL 2025: భారత్-పాక్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రీడా రంగాన్ని కూడా కుదిపేస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసింది. వచ్చే గంటల్లో ఐపీఎల్ 2025 లీగ్‌పై కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ లీగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. విదేశీ ఆటగాళ్లు కూడా భద్రతపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గురువారం ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేయడం క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురి చేసింది. జమ్మూ, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో వైమానిక దాడుల హెచ్చరికలు రావడంతో స్టేడియం ఖాళీ చేయించారు. అభిమానులు, ఆటగాళ్లు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన తర్వాత లీగ్ మొత్తం కొనసాగించాలా లేదా అన్నది బీసీసీఐ ముందున్న ప్రధాన ప్రశ్నగా మారింది.

ఐపీఎల్‌కి సంబంధించి ఆర్థికంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు, లీగ్‌కి ఉన్న విస్తృతమైన అభిమాన వర్గం కారణంగా ఒక నిర్ణయం తీసుకోవడం బీసీసీఐకి తేలిక కాదు. కానీ పహల్గామ్ దాడి తర్వాత భారత్ చేపట్టిన క్షిపణి దాడులు, పాకిస్థాన్ వైపు నుంచి ఎదురవుతున్న ప్రతీకార చలనాలు పరిస్థితిని అత్యంత సున్నితంగా మార్చేశాయి. పంజాబ్, చండీగఢ్, జలంధర్ వంటి ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్ అమలు చేయడం పరిస్థితి తీవ్రమని సూచిస్తోంది.

ప్రస్తుతం అభిమానులు, క్రికెట్ వర్గాలు బీసీసీఐ తీసుకునే నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. భద్రతా పరిస్థితులు మెరుగైతేనే లీగ్ కొనసాగించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. బీసీసీఐ అధికారిక ప్రకటన వరకు ఎలాంటి ఊహాగానాలనూ నమ్మవద్దని సూచనలొస్తున్నాయి.

రాత్రులు నేను చేసే పని Transgender Shashirekha Struggle Life | Transgender Lifestyle | Telugu Rajyam