దక్షిణాది చిత్రాల ప్రముఖుల భేటీ… అంబానీ ఇంట పెళ్లిల్లో కనిపించిన దృశ్యం

టాలీవుడ్‌, కోలీవుడ్‌, మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్‌ హీరోలు ఒకేచోట కలిశారు. కుటుంబసమేతంగా ఫొటోలకు పోజులిచ్చారు. మహేశ్‌బాబు, సూర్య, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. అనంత్‌ అంబానీ వివాహం ఈ అపురూప దృశ్యానికి వేదికైంది. అనంత్‌ పెళ్లి వేడుకల్లో భాగంగా దిగిన ఓ ఆసక్తికర ఫొటోను తాజాగా నటి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ నెట్టింట షేర్‌ చేశారు. మంచి మనసు ఉన్న వ్యక్తులతో అందమైన క్షణాలు‘ అని ఆయన క్యాప్షన్‌ జత చేశారు. ఈ ఫొటోలో విఘ్నేశ్‌ శివన్‌-నయనతార, మహేశ్‌బాబు -నమ్రత, సూర్య- జ్యోతిక, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ -సుప్రియ దంపతులతోపాటు జెనీలియా, అఖిల్‌, సితార తదితరులను చూడొచ్చు.

ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దక్షిణాదిలోని మూడు చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్స్‌ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఆనందంగా ఉందని కామెంట్స్‌ పెడుతున్నారు. రిలయన్స్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు రూ.5 వేల కోట్ల ఖర్చుతో జరిగిన ఈ వివాహ వేడుకలో దేశవిదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ తదితర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన రజనీకాంత్‌, పృథ్వీరాజ్‌సుకుమారన్‌, వెంకటేశ్‌, రామ్‌చరణ్‌, మహేశ్‌బాబు, దర్శకుడు అట్లీ ఈ వేడుకల్లో సందడి చేశారు.