దక్షిణాదిలో ఒకప్పుడు స్టార్ నిర్మాతగా వెలుగొందిన ఏఎం రత్నం ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారనే వార్తలు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశంగా మారాయి. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్పై ఎన్నో బ్లాక్బస్టర్లు అందించిన రత్నం, ఇటీవల సినిమాల విషయంలో సరైన లైన్లో లేరు. ముఖ్యంగా తన కొడుకు జ్యోతికృష్ణకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించి తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కుదరకపోవడం ఆయనను వెనక్కి నెట్టింది.
కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ పునరాగమనం చేసిన ఏఎం రత్నం, పవన్ కళ్యాణ్ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే భారీ పీరియాడిక్ ప్రాజెక్టును మొదలుపెట్టారు. మొదట ఈ సినిమా పట్ల భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ గెటప్, టీజర్, టెక్నికల్ వాల్యూస్ అన్నీ కూడా ఆసక్తిని రేపాయి. కానీ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి రాజకీయాలు, ఇతర సినిమాలతో బిజీగా ఉన్న పవన్కి రెగ్యులర్గా డేట్స్ ఇవ్వలేకపోవడంతో షూటింగ్ వాయిదాలు పడుతూనే ఉన్నాయి.
ఇప్పుడు ఈ సినిమా ఐదేళ్ల క్రితం మొదలైనా ఇంకా విడుదల తేదీ ఖరారు కాలేదు. మే 9న రిలీజ్ ప్లాన్ చేసినా, అది కూడా వాయిదా పడ్డట్టు టాక్. అధికారికంగా ప్రకటన రాకపోయినా, ఇండస్ట్రీలో ఈ విషయంపై గట్టిగానే చర్చ సాగుతోంది. ఈ లోపే సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. వడ్డీలు చెల్లించలేనంత భారంగా మారింది. పైగా ఆలస్యం వల్ల హైప్ కూడా పూర్తిగా తగ్గిపోయింది.
ఈ పరిస్థితుల్లో సినిమా నుంచి పెట్టుబడులు రికవర్ చేయడం కష్టమేనన్న అభిప్రాయమే ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. రత్నం సమీప వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఒత్తిడితో ఆయన తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతున్నారట. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, తన పాత ఆస్తులు అమ్మే దిశగా కూడా ఆలోచిస్తున్నారని సమాచారం. ఒకప్పుడు స్టార్ నిర్మాతగా మార్గనిర్దేశం చేసిన ఏఎం రత్నం ఇప్పుడు ‘వీరమల్లు’ పేరుతో తీవ్రమైన కష్టాల్లో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. మరి పవన్ నిర్మాత విషయంలో ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.