ఆ హిట్టు లవ్ స్టోరీకి సీక్వెల్

19 ఏళ్ళ క్రితం తెలుగు, తమిళ్ భాషలలో వచ్చిన 7/జి బృందావన్ కాలనీ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అప్పటి జనరేషన్ యూత్ కి విపరీతంగా ఈ మూవీ కనెక్ట్ అయిపొయింది. ప్రేమలో డెప్త్ ని ఆ సినిమాతో దర్శకుడు చూపించిన విధానం ప్రతి ఒక్కరికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది.

అలాగే మూవీలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రొడ్యూసర్ ఏ ఎం రత్నం తనయుడు రవికృష్ణ హీరోగా పరిచయం అయ్యారు. ఆ మూవీ నటుడిగా అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే దాంతో వచ్చిన సక్సెస్ ఫేమ్ ని హీరో నిలుపుకోలేకపోయాడు. ఈ మూవీలో సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా తర్వాత ఆమె సెల్వ రాఘవన్ ని పెళ్లి చేసుకుంది. తరువాత కొంతకాలానికి ఇద్దరు విడిపోయారు. ఇప్పటికి ఎవర్ గ్రీన్ చిత్రాల జాబితాలో 7/జి బృందావన్ కాలనీ ఉంటుందని చెప్పాలి. ఇక ఈ మూవీ 2004లో రిలీజ్ అయ్యింది. ఏఎం రత్నం ఈ సినిమాని నిర్మించారు. ప్రస్తుతం ఈ నిర్మాత పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నిర్మాత తాజాగా ఓ ఇంటర్వ్యూలో 7/జి బృందావన్ కాలనీ సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ మూవీకి సీక్వెల్ త్వరలో వస్తోందని చెప్పారు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలోనే ఈ సీక్వెల్ ఉంటుందని, దానికి స్క్రిప్ట్ రెడీ అవుతోందని క్లారిటీ ఇచ్చారు.

అలాగే ఈ సీక్వెల్ లో హీరోగా రవికృష్ణ నటిస్తాడని, మిగిలిన క్యాస్టింగ్ మాత్రం కొత్తవాళ్ళు ఉంటారని చెప్పారు. అలాగే హీరోయిన్ గా కూడా కొత్త అమ్మాయిని తీసుకోవడం జరుగుతోందని అన్నారు. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా ఉంటుందని చెప్పడం విశేషం. మరి ఈ సీక్వెల్ ని ఒరిజినల్ కథకి కొనసాగింపుగా సెల్వ రాఘవన్ తీస్తాడా లేదంటే కొత్త కథతో తెరకెక్కిస్తాడా అనేది చూడాలి.