అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

అజిత్‌ నటించిన తాజా చిత్రం నేర్కొండపార్వై. దివంగత నటి శ్రీదేవి భర్త భోనీకపూర్‌ నిర్మించిన తొలి తమిళ చిత్రం ఇది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం విడుదలయ్యింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు నగరంలోని సినీమాల్స్‌ వద్ద బారీ కటౌట్స్, టపాసులు కాల్చడం వంటి హంగామా చేశారు. కాగా బుధవారం రాత్రి 11.55 గంటల ప్రాంతంలో అజిత్‌ అభిమాని ఒకరు స్థానిక రాయపేటలోని సత్యం సినీ మల్టీప్లెక్స్‌ థియేటర్‌ వద్ద ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురించి నటుడు శాంతను భాగ్యరాజ్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బుధవారం రాత్రి నేర్కొండ పార్వై చిత్రం చూడటానికి టిక్కెట్‌ కొనడానికి సత్యం థియేటర్‌కు వెళ్లగా అక్కడ అజిత్‌ అభిమాని ఒకరు థియేటర్‌ ముందు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. బహుశ టిక్కెట్‌ సమస్య అయ్యి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అక్కడున్న పోలీసులు అతడ్ని అడ్డుకుని అరెస్ట్‌ చేశారు అని పేర్కొన్నారు. అంతే కాకుండా అజిత్‌ లాంటి ప్రముఖ నటుడు ఇలాంటి చర్యలకు అభిమానులు పాల్పడకుండా హితవు చెప్పాలని నటుడు శాంతను ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.