కాజల్ మరో పొరపాటు చేయటం లేదు కదా…

అన్నా చెల్లెలుగా మంచు విష్ణు, కాజల్

రీసెంట్ గా రిలీజైన రణరంగం చిత్రంలో అర్దం పర్దం లేని పాత్ర చేసి అందరి చేతా ట్రోల్ చేయబడుతోంది కాజల్. ఈ వేడి ఇంకా తగ్గకముందే ఆమె ఒప్పుకున్న మరో సినిమా గురించి వార్త ఒకటి బయిటకు వచ్చింది. అది చూసి మళ్లీ ఆమె అభిమానులు షాక్ అయ్యారు. ఆమె ఆలోచించే ఆ పాత్ర చేస్తోందా అని అంటున్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటి

అప్పట్లో ఎన్టీఆర్, సావిత్రి ఇద్దరూ అన్నా,చెల్లెలు గా చేసిన రక్త సంభందం సూపర్ హిట్. ఆ తర్వాత కాలంలో మహేష్ బాబుకు చెల్లిగా హీరోయిన్ కీర్తి రెడ్డి చేసింది. అలా అప్పుడప్పుడూ హీరో,హీరోయిన్స్ …అన్నా చెల్లెలుగా తెరపై కనపడి సర్పైజ్ చేస్తూంటారు. ఇప్పుడు కూడా మంచు విష్ణు, కాజల్ సైతం అలాగే మనను ఆశ్చర్యంలో ముంచబోతున్నారు.

యంగ్ హీరో మంచు విష్ణు ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు కాజల్‌ అగర్వాల్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కాజల్‌, విష్ణు సరసన హీరోయిన్‌గా నటించటం లేదట. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్నా చెల్లెల్ల పాత్రలు కీలకం కావటంతో విష్ణు, కాజల్‌లు ఆ పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం.

ఈ విషయం ఎలా బయిటకు వచ్చిందీ అంటే..ఈ సినిమా సెట్‌లో విష్ణుతో కలిసి స్నాక్స్‌ తింటున్న ఫొటోను రక్షాబంధన్‌ సందర్భంగా కాజల్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘హ్యాపీ రాఖీ అర్జున్‌!’ అంటూ మంచు విష్ణును ట్యాగ్‌ చేశారు. దీనికి ఆయన ప్రతి స్పందించారు. ‘హాహాహా.. థాంక్స్‌ అను. చేతుల్లో ఫుడ్‌ లేకుండా మనం కలిసి ఉన్న ఒక్క ఫొటో కూడా లేదనుకుంటా’ అంటూ కాజల్‌ను ట్యాగ్‌ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమాలో విష్ణు అర్జున్‌ పాత్రలో, కాజల్‌ అను పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది.

ఓ హాలీవుడ్‌ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. క్రైమ్‌ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందిస్తున్నారట. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.