Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జగన్ హయాంలో విప్లవాత్మక మార్పులు గత వైఎస్ జగన్ ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను, సామాన్యులకు వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేసిందని బొత్స గుర్తు చేశారు. ఆ సమయంలో మంజూరైన కళాశాలల్లో ఇప్పటికే 5 పూర్తి కాగా, మరో 12 నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. అయితే, ఈ కళాశాలల ద్వారా జగన్కు మంచి పేరు వస్తుందనే దుగ్ధతోనే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వాటిని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
పేదలకు అన్యాయం “ప్రజారోగ్యం అనేది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత. దానిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే పేదలకు తీరని అన్యాయం జరుగుతుంది. పీపీపీ విధానం ద్వారా లబ్ధి పొందాలనే చంద్రబాబు దుర్బుద్ధి ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది,” అని బొత్స మండిపడ్డారు. ప్రభుత్వ విధానాల వల్ల పేద ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గవర్నర్కు ఫిర్యాదు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి సంతకాల రూపంలో అభిప్రాయ సేకరణ చేపడతామని బొత్స ప్రకటించారు. అనంతరం వైఎస్ జగన్ నేతృత్వంలో ఈ వినతి పత్రాన్ని రాష్ట్ర గవర్నర్కు అందజేస్తామని, ఇందుకోసం గురువారమే గవర్నర్ అపాయింట్మెంట్ కోరామని వెల్లడించారు.


