పులిమీద స్వారీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి 

Supreme court judgement slap to Yellow Media
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులు, సుప్రీమ్ కోర్టులోని సీనియర్ న్యాయమూర్తిలపై  కొన్ని ఆరోపణలతో భారత ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖను సంధించడం దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 
 
YS Jagan Vs Judiciary
 
తెలుగుదేశం అనుకూల మీడియా ప్రభుత్వ పత్రికసమావేశ వివరాలను అక్షరం ముక్క కూడా ప్రసారం చెయ్యకుండా, ప్రత్రికా ధర్మాన్ని మంటగలిపినప్పటికీ, కొన్ని తెలుగు పత్రికలు, కొన్ని జాతీయ పత్రికలు, ఛానెల్స్ ఈ విషయాన్నీ బాగానే కవర్ చేశాయి.  జగన్ ఆ విధంగా లేఖ రాయడాన్ని అసలు ఒక వార్తే కానట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఆ మరుసటిరోజునుంచి తమకు అనుకూలంగా మాట్లాడే వారితో ఖండనలు చేయించడం మొదలుపెట్టిందంటేనే వారిలో తెలియని భయం ఆవరించినట్లు అర్ధం చేసుకోవాలి.  సుప్రీమ్ కోర్ట్ ఈ లేఖపై ఎలాంటి చర్య ప్రారంభించకముందే ఎవరెవరో బార్ అసోసియేషన్ల వారు ఖండించారని . కొందరు తమిళనాడు  మహిళా న్యాయవాదులు దుమ్మెత్తిపోశారంటూ  వార్తలు వడ్డిస్తున్నాయంటే భావమేమిటి?  తమ యజమానికి ఆపద తధ్యం అన్న బెదురు కలగడమే కదా? 

న్యాయమూర్తులు ఏ విధంగా అతీతులు?

జగన్ మోహన్ రెడ్డి సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖను రాయడం, దానిలోని అంశాలు బయటకి పొక్కడంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది.  న్యాయమూర్తులు అంటే సమాజంలో ఎంతో గౌరవం, భక్తిప్రపత్తులు ఉన్నాయి.  న్యాయదేవతకు వారు ప్రతినిధులు అని, వారు ఎలాంటి పరిస్థితుల్లో తప్పు చెయ్యరు అనే నమ్మకం ప్రజల్లో ఉన్నది.  అయితే అలాంటి న్యాయమూర్తులతో కొందరు అవినీతిలో ఆస్తులు సంపాదించారని, పక్షపాతంతో తీర్పులు ఇస్తున్నారని సాక్షాత్తూ ఒక ప్రభుత్వాధినేత ఆరోపించిన తరువాత న్యాయవ్యవస్థ పట్ల కొంచెమైనా సందేహాలు కలగడం సహజం.  చంద్రబాబు లాంటివారు ఇలాంటి ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మకపోవచ్చు కానీ, విశ్వసనీయతకు మారుపేరైన జగన్ మోహన్ రెడ్డి చేసిన తరువాత వాటిని కొందరైనా నమ్ముతారు.  ఇక “కేసులున్న వ్యక్తి చేసే ఆరోపణలు విలువ లేనివి” అని పచ్చకామెర్లవారు కొట్టి పారెయ్యడం వారి సహజగుణదోషం అనుకోవాలి.  కేసులున్న వ్యక్తి ఆరోపణలు చెయ్యకూడదని ఎక్కడైనా నిబంధనలు ఉన్నాయా?   ఉరిశిక్ష విధించబడిన ఖైదీ సైతం ఆరోపణలు చెయ్యడానికి మన చట్టం అనుమతిస్తుంది.  కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల మీద కచ్చితంగా విచారణ జరగాల్సిందే.  న్యాయమూర్తులు కూడా ఉద్యోగులే.  వారికీ పదవీ విరమణ ఉన్నది.  వారు తీసుకునేవి ప్రజలు కట్టే పన్నుల్లోంచి ఇచ్చే జీతాలే.  అలాంటపుడు వారు ఎందుకు జవాబుదారీ కారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  మనది ప్రజాస్వామ్య దేశమే తప్ప నియంతృత్వ దేశం కాదు.  ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యవస్ధ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే.  ఏ వ్యవస్థా మమ్మల్ని ప్రశ్నించడానికి వీల్లేదు అంటే ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది అని ప్రజలు నిలదీస్తున్నారు!  

జగన్ కు పెరుగుతున్న మద్దతు 

జగన్ లేఖాస్త్రంపై మొదటి రోజు ఎవరూ మాట్లాడలేదు.  తరువాత తరువాత మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు గళం విప్పడం ప్రారంభించారు.  జస్టిస్ ఏకే గంగూలీ, జస్టిస్ మార్కండేయ కట్జూ, ప్రశాంత్ భూషణ్ మొదలైన వారు “న్యాయమూర్తుల  అవినీతి  మీద విచారణ జరిపించాల్సిందే” అంటూ అభిప్రాయాలు వెలిబుచ్చారు.  “ప్రజల గొంతులను నొక్కేసి న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసాన్ని రక్షించలేరు” అంటూ  వ్యాఖ్యానించడం ద్వారా న్యాయవ్యవస్థ శీలపరీక్షకు అతీతం కాదు అంటూ స్పష్టం చేశారు.  విశేషం ఏమిటంటే జగన్ రాసిన లేఖ తప్పు అని ఏ ఒక్క మాజీ న్యాయమూర్తి కూడా ఈరోజువరకు ఖండించలేదు.  ఎవరో  కొందరు ఊరూపేరూ లేని లాయర్లు చేసే తీర్మానాలను మహాప్రసాదాలుగా స్వీకరించి ఎల్లో మీడియా పతాక శీర్షికలకు ఎక్కిస్తున్నది!  ఎంత హాస్యాస్పదం!!!

జగన్మోహన్ రెడ్డి  పులిమీద  స్వారీ చేస్తున్నారా?

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దేశంలో ఈరోజు వరకు ఏ రాజకీయనాయకుడు ప్రదర్శించని సాహసాన్ని ప్రదర్శించారు అని మేధావులు, సామాన్యులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.  ఇంత సువిశాల దేశంలో ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన యువకుడు, తన ఉజ్వల రాజకీయ జీవితాన్ని, అధికారాన్ని, పేరుప్రతిష్టలను కూడా పణంగా పెట్టి పర్వతం లాంటి ఒక వ్యవస్థను ఢీ కొట్టడం అంటే అసలు కలలో కూడా ఊహించని పరాక్రమం అని అభివర్ణించాలి.  ఎవరెంత విమర్శించినా, గజరాజు- వీధికుక్కల  సామెతను  గుర్తుకు  తెస్తూ జగన్ ముందుకు సాగిపోవడం ఒక అసంభవమైన అద్భుతంగా పేర్కొనాలి.  ఆయన చేస్తున్నది అక్షరాలా పులిమీద స్వారీ.  ఎవరేమన్నా, ఎందరు వారించినా ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని  అయన అడుగులు స్పష్టం చేస్తున్నారు.  ఎల్లుండి ఆదివారం ఢిల్లీలో అమీతుమీ తేల్చుకోవడానికి నేరుగా రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  అదేవిధంగా ఆ సీనియర్ న్యాయమూర్తి మీద అభిశంసన తీర్మానాన్ని కూడా పార్లమెంట్ లో ప్రతిపాదించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారని అంటున్నారు.  అయితే అందుకు కావలసిన మెజారిటీ కోసం బీజేపీ సహకరించాల్సిందే.  కేవలం వైసిపికి ఉన్న సంఖ్యాబలంతో అది సాధ్యం కాదు.  పార్లమెంట్ లో చర్చ జరిగినా, జరగకపోయినా, రాష్ట్రపతి దృష్టికి వెళ్లిందంటే దానిమీద ఏదోవిధంగా చర్య తీసుకోక తప్పదు.  మరి ఈ అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుందో దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నది.  ఈ పరిస్థితుల్లో జగన్ ఏమాత్రం వెనక్కు తగ్గినా ఆయన్ను మింగడానికి అనేక రకాల పులులు నోళ్లు తెరుచుకుని చూస్తున్నాయి.  జగన్ మనస్తత్వం ఎరిగినవారు మాత్రం ఈ పోరాటంలో పులిని సంహరించి తోలు వలిచేదాకా జగన్ నిద్రపోరు అని ఘంటాపధంగా చెబుతున్నారు!    
 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు