తెలంగాణలో పవన్  జనసేన పోటీ లేనట్లేనా ?!

(మల్యాల పళ్లంరాజు*)

 

తెలంగాణలో ఎన్నికల వేడి  తీవ్రమవుతా ఉంది.  తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆధ్వర్యంలోని కేబినెట్ నిర్ణయం, గవర్నర్ నరసింహన్ ఆమోదంతో  అసెంబ్లీ రద్దు కాగా, కొత్తగా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధాన ఎన్నికల కమిషన్ సన్నాహాలు ప్రారంభమయింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే జరిగిన ప్రెస్ మీట్ లో 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి సమర శంఖారావాన్ని పూరించారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ తో పాటు, అంతంత మాత్రంగా ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు తమ తమ ప్రణాళికా రచనలో పడ్డాయి.  అయితే …

జనసేన అధినేత పవన్ కల్యాణ్ శిబిరంలో మాత్రం ఎలాంటి హడావుడి లేదు.  అసెంబ్లీ రద్దు వంటి చారిత్రాత్మక నిర్ణయం జరిగితే నోరు మెదపని నాయకుడెవరయినా ఉన్నారా అంటే అది పవన్ కల్యాణ్ ఒక్కరే.  తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో  పోటీ చేసేందుకు జనసేన పార్టీ ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.  పవన్ కల్యాణ్ కు తెలంగాణలో అభిమానులకు కొదవ లేదు. కానీ, జనసేన ఈ రాష్ట్రంలో ఓ సమగ్రమైన పార్టీగా ఇంకా వేళ్లూను కోలేదు. అలాంటి ప్రయత్నమూ జరగలేదు. తెలంగాణా జనసేన కార్యక్రమం ఏదయిన జరిగిందా అంటే అది పార్టీ కార్యాలయంలో పవన్ అపుడపుడూ సమావేశాలు జరపుకోవడమే. పార్టీకి కేడర్ లేదు. జిల్లాల వారీగా ఓ యంత్రాంగం కూడా లేదు. ఎన్నికల బరిలో దిగే అర్థ, అంగబలం కూడా తక్కువే. జనసేన  పార్టీ ఆంధ్రా పార్టీగా పెరుగుతూ వస్తున్నది తప్ప తెలుగు రాష్ట్రాల పార్టీగా తయారవడం లేదు. తెలంగాణలో జనసేన అలికిడి లేదు. ఇది ఆశ్చర్యమే.

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టి అంతా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జనసేనను బలోపేతం చేసే కార్యక్రమంపై ఉంది.  పవర్ స్టార్ జిల్లాల వారీగా యాత్రలు జరుపుతూ, మరో పక్క ప్రణాళిక ప్రకారం పార్టీని నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీ పార్టీల కూటమికి మద్దతు ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు,  రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పనితీరు, రాజధాని భూముల విషయంలో చంద్రబాబు అనుసరించిన విధానాలు, భూకబ్జాల పరంపర, ప్రభుత్వం సాగిన తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న పవన్ కల్యాణ్.. ఈ సారి ఎన్నికల బరిలో దిగి, అటు అధికార తెలుగుదేశం, ఇటు జగన్ మోహన్ రెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీతో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సత్వర సమగ్రాభివృద్ధికి ప్రత్యేక హోదా తప్పని సరి అని భావిస్తున్న పవర్ స్టార్  హోదా అంశాన్ని పట్టించుకోని, కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాల తీరును దుమ్మత్తి పోస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తోపాటు, కేంద్ర ప్రభుత్వం ను కూడా తన విమర్శనాస్త్రాలతో చిత్తు చేస్తున్నారు.

చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలు చేస్తూ, జనంలో తన పలుకుబడిని పెంచుకునే యత్నం చేస్తున్నా, ఆయనను సామాన్య ప్రజలు పూర్తిగా నమ్మడం లేదన్నది వాస్తవం. పైగా, అసెంబ్లీ  సమావేశాలను మూడేళ్లుగా పూర్తిగా బహిష్కరించడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం పట్ల జనం ఆగ్రహంతో ఉన్నారు. ఈ దశలో ప్రజలు సరైన, సమర్థుడైన ప్రత్యామ్నాయ నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఎలాంటి అవినీతి మచ్చలేని పవన్ కల్యాణ్ దీటైన ప్రత్యామ్నాయ నాయకుడుగా ఆవిర్భవించగలడని జనసేన కేడర్, మెగా అభిమానులతో పాటు చాలా వర్గాల ప్రజలు భావిస్తుండడంతో, సరైన ప్రత్యామ్నాయం కల్పించేందుకు పవన్ కల్యాణ్ విస్తృతంగా కృషి చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి అధికార పీఠం అందుకునేందుకు జనసేన అధినేత పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఆ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల బరిలో దిగి చేతులు కాల్చుకోవడం వ్యూహాత్మక తప్పిదమే అవుతుందని పార్టీ అధినేత భావిస్తున్నారు.

   

నిజానికి తెలంగాణలో ప్రస్తుతానికి  కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురు లేదు. క్లీన్ స్వీప్  సాధించగలమన్న పూర్తి ధీమాతోనే కేసీఆర్ దాదాపు 8 నెలలకు ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల సమరంలోకి దిగుతున్నారు. పరిస్థితులు ఆయనకు అనుకూలంగానే ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయట. ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీతో పాటు అన్నిపార్టీలు కూటమిగా ఏర్పడినా కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని మెజారిటీ సర్వేలు చెప్పాయట.  ఈ దశలో అంతగా కేడర్ లేని జనసేన, పెద్దగా ప్రభావం చూపలేని సీపీఎంతో కలిసి తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తే, ఒక్క సీటు అయినా గెలుచుకో గలదా?  అందుకే

 

తెలంగాణ లో ఎన్నికల బరిలోకి దిగరాదని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహిత మిత్రులు, జనసేన నేతలు చెబుతున్నారు.  ఒక వేళ తెలంగాణలో  పోటీచేసి, డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఏర్పడితే ఆ ప్రభావం,… ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై పడుతుందని ముందు ఆలోచనతోనే ఈ సారికి ఎన్నికల గోదాలోకి దిగరాదని భావిస్తున్నారట.

 

కేసీఆర్ కు మద్దతు..?

 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సాకారం అయ్యేందుకు దాదాపు 20 ఏళ్లుగా అవిరళ కృషి చేసిన కె. చంద్రశేఖర్ రావు అంటే తనకు  ప్రత్యేక అభిమానం ఉందని ఈ మధ్క పవన్ కల్యాణ్ చెబుతున్నారు. దీన్ని కెసిఆర్ అసలు నమ్మరు. కెసిఆర్ ను పవన్ తాటతీస్తానన్నమాట, అరే, వాడి పేరిందిరా బై అని కెసిఆర్ అన్నమాటలు  గూగుల్ అర్కైవ్స్లో కుప్పులుకుప్పులున్నాయి. రాజకీయాల్లో ఇలాంటి చెబుతూ ఉండాలి. పవన్ ను తరిమేస్తామని టిఆర్ ఎస్ నేతలన్నారు.నీకిక్కడ తెలంగాణలో ఏంపని, ఆంధాకెళ్లిపో అని తెలంగాణ జాగృతి కవిత గర్జించారు . అయితే, ఈ మధ్య పవన్  పాత గొడవలు మర్చిపోయారు.  రాష్ట్రంలో విద్యుత్ సమస్యల పరిష్కరించడంలో  ముఖ్యమంత్రి కృషిని మెచ్చుకోవడంతో పాటు, పవన్ కల్యాణ్ స్వయంగా కేసిఆర్ ను కలిసి అభినందనలు తెలియజేశారు కూడా.

ప్రస్తుతానికి జనసేన అధినేతకు తెలంగాణ ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరే ఉంది. ఎలాంటి వ్యతిరేక భావనలు లేవు. పైగా, తెలంగాణలో విస్తృతమైన సంక్షేమ పథకాలు, రైతు బంధు, రైతు సహాయ పథకాలు, పలు సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి అభివృద్ధి పథంలో  దూసుకు వెళ్తున్న కేసిఆర్ సర్కార్ కు మద్దతు ప్రకటించే అంశాన్ని పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నారని సన్నిహిత వర్గాల కథనం. దీని వల్ల భవిష్యత్ లో ఒనగూరే ప్రయోజనాలు కూడా బేరీజు వేస్తున్నారు. త్వరలోనే పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి , తెలంగాణలో తమ జనసేన ఈ సారి ఎన్నికల బరిలోకి దిగబోదని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో  కెసీఆర్ పార్టీ టీఆర్ ఎస్ కు జనసేన మద్దతు ప్రకటించవచ్చునని టాక్.

 

(*మల్యాల పళ్లంరాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్)