తెలంగాణ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు తయారైంది. మొన్నటి ముందస్తు ఎన్నికల్లోనే విపక్షాలు కకావికలమైన పరిస్థితి ఉంటే… ఇక అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు అడుగు బొడుగు లేకుండా ఊడ్చుకుపోయే ప్రమాదం నెలకొంది. మొన్నటి ఎన్నికల్లో వట వృక్షాలే నేల కూలిపోగా అక్కడో ఇక్కడో గెలిచిన వారంతా ఇప్పుడు గులాబీ కారెక్కేందుకు సిద్ధపడ్డట్లు వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరబోతున్నారని ఇప్పటికే గులాబీ నేతలు మీడియాకు లీకులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాము 12 మందిని సంప్రదించామని, 8 మంది కారెక్కేందుకు రెడీగా ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎవరు ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అన్నదానిపై రాష్ట్రవ్యాప్తంగా ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే వివరణ కూడా ఇచ్చారు. తాము టిఆర్ఎస్ లోకి వెళ్లడంలేదని కామెంట్ చేశారు. అయినా వారిపై పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇంతకూ వారెవరు అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. పూర్తి వివరాలు చదవండి.
ఖమ్మం జిల్లా రాజకీయాలు చూస్తే :
ఖమ్మం జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ 6 సీట్లలో గెలిచింది. తెలంగాణ అంతటా టిఆర్ఎస్ ఘన విజయం సాధించినా ఖమ్మంలో మాత్రం చావుదెబ్బ తిన్నది. ఇక్కడ టిడిపి రెండు సీట్లలో గెలిచింది. టిఆర్ఎస్ మాత్రం ఒక సీటుకే పరిమితం అయింది. ఒక ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్ ఇప్పటికే టిఆర్ఎస్ గూటికి చేరారు. మిగిలిన వారి గురించి జరుగుతున్న ప్రచారం చూద్దాం…
మధిర – మల్లు బట్టి విక్రమార్క- ఈయన మీద టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం పనిచేయదు. ఈయన కాంగ్రెస్ లోనే కొనసాగుతారు.

భద్రాచలం – పోడెం వీరయ్య- ఈయన ప్రత్యేక పరిస్థితుల్లో (మావోయిస్టుల ప్రాభల్యం ఉన్నచోట) భద్రాచలంలో గెలిచారు. ఆపరేషన్ ఆకర్ష్ కు లోనై వెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు.
పినపాక – కాంతారావు – లాంగ్ స్టాండింగ్ పాలిటిక్స్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్న కాంతారావు పై ఆకర్ష్ వల పనిచేయకపోవచ్చని చెబుతున్నారు.
ఇక ఖమ్మం జిల్లాలో మిగిలిన ముగ్గురి మీద ఆపరేషన్ ఆకర్ష్ ప్రచారం సాగింది. వారిలో…
ఇల్లెందు – హరిప్రియ నాయక్- ఈమె టిఆర్ఎస్ గూటికి చేరవచ్చని ప్రచారం సాగింది. అయితే ఆమె దాన్ని ఖండించారు. రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ లోకి వచ్చిన తాను టిఆర్ఎస్ లో చేరే ప్రసక్తే లేదని చెప్పారు. హరిప్రియ నాయక్ కు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానం ఉంది.
కొత్తగూడెం- వనమా వెంకటేశ్వరరావు – వనమా మీద ఆపరేషన్ ఆకర్ష్ ప్రచారం జోరుగా సాగింది. ఆయన కుటుంబసభ్యుల్లో కూడా చర్చ సాగింది. అధికార పార్టీలో ఉండాలన్న ఆకాంక్ష వనమా కు ఉన్నట్లు టాక్ ఉంది. ఈ పరిస్థితుల్లో వనమా పార్టీ మారుతారా? లేదా అన్నది తేలలేదు.
పాలేరు – కందాల ఉపేందర్ రెడ్డి. ఈయన కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు. ఎంపీ పొంగులేటితో సన్నిహిత సంబంధాలున్నాయి కాబట్టి ఈయన పార్టీ మారుతారు అన్న ప్రచారం ఉంది. ఆపరేషన్ ఆకర్ష్ టీమ్ ఈయనతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. కానీ ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ముచ్చట్లు చూస్తే…
ఖమ్మంలో కూటమికి మరిన్ని సీట్లు వచ్చాయి. ఆ తర్వాత సీట్లు నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కు వచ్చాయి. మూడు సీట్లు కాంగ్రెస్ సాధించింది ఇక్కడ. ఆ ముగ్గురిలో ఇప్పటికే ఇద్దరి మీద ఆపరేషన్ ఆకర్ష్ ప్రచారం నడిచింది. ఒకరి మీద నడవలేదు. వారెవరో చదవండి.
హుజూర్ నగర్ – కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి- ఈయన ప్రస్తుతం పిసిసి ప్రసిడెంట్ గా ఉన్నారు. ఈయన మీద ఆపరేషన్ ఆకర్ష్ వల లేదు. కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్ వర్కర్ అనే పేరుంది.

మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – రాజగోపాల్ రెడ్డి మీద ఆపరేషన్ వల విసిరింది టిఆర్ఎస్. అయితే ఆ వలకు చిక్కారా లేదా అన్న సమాచారం మాత్రం బయటకు రాలేదు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చూచాయగా వెల్లడించారు. తాను టిఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు పుకార్లు చేస్తున్నారు.. కానీ తానేమీ టిఆర్ఎస్ లోకి వెళ్లబోనని, అవసరమైతే కేసిఆర్ నే కాంగ్రెస్ లోకి తీసుకొస్తానని కామెంట్ చేశారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాపారవేత్తగా ఉన్నారు. ఈయన మీద ఆపరేషన్ వల పనిచేయవచ్చా అన్న అనుమానాలైతే ఉన్నాయి. పైగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు పిసిసి చీఫ్ ఉత్తమ్ కు అసలే పడదు. ఈ రకంగా చూసుకున్నా కోమటిరెడ్డి బ్రదర్స్ ఆకర్ష్ వలలో చిక్కే చాన్స్ ఉంటుందని టిఆర్ఎస్ వర్గాలు ధీమాతో ఉన్నాయి.
కోమటిరెడ్డి బ్రదర్స్ లెక్కలు ఇవి…
కోమటిరెడ్డి బ్రదర్స్ కు నల్లగొండ రాజకీయాల్లో మంచి పట్టున్నవారు. నల్లగొండ జిల్లాలో బలం, బలగం ఉన్న నేతలు. వీరిద్దరూ మొన్న ఎన్నికల్లో పోటీ చేస్తే రాజగోపాల్ రెడ్డి మునుగోడులో గెలిచారు. కానీ నల్లగొండలో వెంకట్ రెడ్డి ఓటమిపాలయ్యారు. అయితే ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు కూడా ఇప్పటికే ప్రచారం షురూ అయింది. ఆయన కూడా తాను ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తన అనుచరులకు సంకేతాలు పంపారు. రాహుల్ గాంధీ కూడా ఈ మేరకు అంగీకరించినట్లు వెల్లడించారు. అదే సమయంలో నల్లగొండ పార్లమెంటుకు కేసిఆర్ పోటీ చేయబోతున్నారన్న సంకేతాలు కూడా టిఆర్ఎస్ వర్గాల నుంచి వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఎలాగైనా టిఆర్ఎస్ గూటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది గులాబీ శిబిరం. కానీ తాము చేయి గుర్తు వీడే ప్రసక్తే లేదని వీరు చెబుతున్నారు. కానీ ప్రచారం మాత్రం జోరుగా ఉంది.
నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య – ఈయన కోమటిరెడ్డి కి అనుంగు శిష్యుడు. కాబట్టి ఆయన కోమటిరెడ్డి సోదరులు ఎటు ఉంటే అటే ఈయన కూడా ఉంటారని అంటున్నారు. ఈయన మీద ప్రత్యేకంగా ఆకర్ష్ వల విసిరిన దాఖలాలు లేవు.
మిగిలిన జిల్లాల్లో పరిస్థితులు ఒకసారి చూద్దాం…
రంగారెడ్డిలో ఎల్బీ నగర్ సీటులో గెలిచిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మీద కూడా ఆపరేషన్ ఆకర్ష్ వల విసిరినట్లు చెబుతున్నారు. కానీ ఈయన విషయం మాత్రం బయటకు పొక్కలేదు. నిత్యం జనాల మధ్య ఉండే సుధీర్ రెడ్డి టిఆర్ఎస్ లోకి పోతారా లేదా అన్నది కేడర్ కు ఇంకా క్లారిటీ రాలేదు.
మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి – ఈమె కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా పనిచేశారు. అయితే ఈమె మీద కూడా ఆపరేషన్ ఆకర్ష్ వల విసిరారు. మంత్రి పదవిని కూడా ఆఫర్ పెట్టినట్లు కూడా ప్రచారం సాగింది. ఈ విషయం మీద సబిత స్పందించారు. తానేమీ కాంగ్రెస్ ను వీడడంలేదని చెప్పారు. కానీ టిఆర్ఎస్ వర్గాల నుంచి ఇంకా ప్రచారం సాగుతూనే ఉంది.
ములుగు – సీతక్క – ఈమె నక్సలైట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నాయకురాలు. దొరల ఏలుబడికి బద్ధ వ్యతిరేకి. తెలంగాణ ఉద్యమ కాలంలోనే టిఆర్ఎస్ లో ఈమెను తీసుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేసినా సీతక్క చేరలేదు. టిడిపిలోనే ఉన్నారు. అయితే తెలంగాణలో టిడిపి కి ఫ్యూచర్ లేదన్న కారణంతో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈమె మీద ఆపరేషన్ ఆకర్ష్ వల లేదని చెబుతున్నారు.

భూపాలపల్లి – గండ్ర వెంకట రమణారెడ్డి – టిఆర్ఎస్ వ్యతిరేక ముద్ర వేసుకున్నారు. పిసిసి రేస్ లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఈయన మీద ఆపరేషన్ ఆకర్ష్ వల లేదని అంటున్నారు.
ఎల్లారెడ్డి – జాజుల సురేందర్ – టిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిని ఓడించిన జాజుల సురేందర్ మీద ఆకర్ష్ వల విసిరినట్లు చెబుతున్నారు. సురేందర్ తెలంగాణ ఉద్యమ కారుడు కావడం, కేటిఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉండడం కారణంగా ఈయన మీద ఆకర్ష్ వల పనిచేయవచ్చని అంటున్నారు. ఇప్పటికే చర్చలు కూడా జరిగినట్లు చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత జాయినింగ్ ఉండొచ్చని సమాచారం.
ఆసిఫాబాద్ – ఆత్రం సక్కు – ఆపరేషన్ ఆకర్ష్ వల విసిరినట్లు చెబుతున్నారు. కానీ చర్చల దశలోనే ఉన్నట్లు సమాచారం.
మంథని – దుద్దిళ్ల శ్రీధర్ బాబు – కాంగ్రెస్ హయాంలో మాజీ మంత్రి. శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు మాజీ స్పీకర్. కాంగ్రెస్ కుటుంబం కాబట్టి పార్టీ మారే అవకాశాలు లేవు. ఆపరేషన్ వల లేదని చెబుతున్నారు.

మెదక్ – తూర్పు జయప్రకాష్ రెడ్డి – కేసిఆర్ ఫ్యామిలీని తిట్టను… కాంగ్రెస్ వీడను అని జగ్గారెడ్డి ప్రకటించారు. తన భార్యకు ఎంపీ సీటు అడుగుతున్నారు. ఎన్నికల ముందు పాస్ పోర్టు కేసులో జగ్గారెడ్డిని అరెస్టు చేసే వరకు కేసిఆర్ కుటుంబం మీద మిరిపిత్తు ఎగిరినట్లు ఎగిరిండు. కానీ అరెస్టు తర్వాత ఎన్నికల ప్రచారం లో కూడా సరిగా పాల్గొనలేదు. ఎన్నికల తర్వాత స్వరం మార్చారు. కేసిఆర్ ఫ్యామిలీని విమర్శించను అంటూనే కాంగ్రెస్ ను వీడను అని ప్రకటించారు. ఆపరేషన్ వల జగ్గారెడ్డి మీద కూడా పడిందని చెబుతున్నారు.
తాండూరు – పైలెట్ రోహిత్ రెడ్డి – గతంలో టిఆర్ఎస్ నుంచే కాంగ్రెస్ వెళ్లారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో వైరం ఉంది. ఆపరేషన్ ఆకర్ష్ వల విసిరినట్లు చెబుతున్నారు. కానీ ఇంకా క్లారిటీ రాలేదు.
కొల్లాపూర్ – బీరం హర్ష వర్దన్ రెడ్డి – ఇక్కడ మాజీ మంత్రి, కేసిఆర్ సామాజికవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జూపల్లిని ఎంపీగా పోటీ చేయించే పరిస్థితి ఉంటే ఈయనను పార్టీలోకి తీసుకోవచ్చు. ఈయన మీద కూడా ఆకర్ష్ వల విసిరినట్లు చెబుతున్నారు.
