తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఎపికి ఇస్తే తమకు ఇవ్వాలని మెలిక పెట్ట లేదా?
(వి.శంకరయ్య)
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రోజు కొక మలుపు తిరుగుతున్నాయి. రాజకీయ నాయకులకు ఒక నాలుక కాదని అవసరం బట్టి ఎన్ని నాలుకులైనా పుట్టుకు వస్తాయనేది కొత్తేమి కాదు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా పై ఎన్ని రకాలుగా మాట్లాడారో చెప్పపని లేదు. తాజా గా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ప్రత్యేక హోదా పై మాట మార్చడం సరికొత్త పరిణామం. శనివారం పత్రికల వారితో మాట్లాడుతూ ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వమని ప్రధానికి లేఖ రాస్తామని చెబుతూ తాము మాట మార్చడంలేదని చెప్పిఎపి ప్రజలను ఆశ్చర్యం లో పడేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలోఎపికి ఇస్తే తమకూ ఇవ్వాలని నొక్కి చెప్పిన మాటలు ప్రస్తుతం ప్రస్తావనకు తీసుకు రాకుండా గతంలో తమ సభ్యులు పార్లమెంటులో కూడా బల పరిచారని చెప్పు కొచ్చారు. ఈ తిరకాసు వెనుక మర్మం లేక పోలేదు.
తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు గిఫ్ట్ ఇచ్చారని అందుకు బదులుగా తాను గిఫ్ట్ ఇవ్వాలని కెసిఆర్ చెబుతున్నారు. మున్ముందు ఈ గిఫ్ట్ ఏలా వుంటుందో కాసేపు పక్కన పెడితే ఎపి రాజకీయాల్లో కెసిఆర్ జోక్యం చేసుకోవాలంటే ప్రత్యేక హోదా అంశం అడ్డంకిగా వుంది. కాబట్టి ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తను అడ్డు కాదని దాని సాధనకు తను కృషి చేస్తానని టిడిపి నేతలు తనపై చేసే విమర్శల నుండి తప్పించు కొనేందుకు కెసిఆర్ ఈ పల్లవి అందు కున్నారు. కెసిఆర్ అంతటితో ఆగలేదు.
ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు మార్లు మాటలు మార్చడం తదితర వైఫల్యాల గురించి ఎపిలో ప్రతి పక్ష నేత జగన్ ఒక్కరే కాదు. పవన్ తో పాటు వామపక్షాలు హోదా సాధన నేతలు ఏ విమర్శలైతే ఇప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు పై చేస్తున్నారో అవే విమర్శలు ఆరోపణలు శనివారం కెసిఆర్ చేయడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శలు గుప్పించేందుకు మాటలు మార్చడంలో మహా నేర్పిరి అని తెలియ జెప్పేందుకు ఈ సందర్భాన్ని ఉపయోగించు కొన్నారు.
అచ్చం ఎపి నేతలాగా మాట్లాడారంటే ఎపి ప్రజల క్షేమం కోసం తను అహర్నిశలు పాటు పడుతానని పరోక్షంగా తెలియ చెప్పడమే. . తనపై ఎపి టిడిపి నేతలు విరుచుకుపడే అవకాశాల అడ్డు క్రమేణా తొలి గించు కొనేందుకు కెసిఆర్ ఒక మెట్టు దిగి నట్లుంది. 2014 నుండి ఇప్పటి వరకు చంద్రబాబు పలు అంశాలపై ఎన్నెన్నో రకాలుగా మాట్లాడారని ఎండ గట్టేందుకు కెసిఆర్ కత్తులకు సాన పెడుతున్నారు.ఎపిలో అన్ని ప్రతి పక్షాలు ఇదే విధంగా ఆరోపణలు చేయడం మనమెరుగుదుం. కాని కెసిఆర్ వాడే పరుష పద జాలం తెలంగాణ యాసగా అచ్చట ఆమోదించుతారేమో గాని ఎపిలో అడ్డంతిరిగే అవకాశముంది. కెసిఆర్ ఆశించిన మేరకు స్పందిన రాలేదు.
ఇదిలా వుండగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎందుకో బాలెన్స్ తప్పి మాట్లాడటం ప్రారంభించారు. ముఖ్యమంత్రి కి సలహా ఇచ్చే వారు వున్నట్టు లేదు. కంచే చేనును మేసితే మిగిలేదేముంది? తెలంగాణ ఎన్నికలలో పార్టీ ఫిరాయించిన వారిని తరిమి కొట్టాలని చిత్తు చిత్తు గా ఓడించాలని పదే పదే చెప్పారు. ఇది మున్ముందు మ ఎపిలో మెడకు గుడి బండగా వుంటుందనే ఊహ లేక పోయింది. పైగా హైకోర్టు విభజనకు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరుపున ప్రమాణ పత్రం దాఖలు దాఖలు చేశారు. తదనుగుణంగా రాష్ట్ర పతి నోటిఫికేషన్ ఇస్తే ఆదరా బాదరగా మార్పు చేస్తున్నారని విమర్శించడంఎంత వరకు సబబు.?పైగా అనవసరంగా జగన్ కేసులు గురించి కెలికి కక్ష అనే బురదలో కాలేశారు. టిడిపి కి నెగిటివ్ మార్కులు తప్పవు. పలు అంశాల్లో ముఖ్యమంత్రి మాటలు పరస్పర విరుద్ధంగా వుండటం ఎపి ప్రజలే అంగీకరించడంలేదు. తుదకు రాజకీయాలతో సంబంధం లేని వారు కూడా ముఖ్యమంత్రి మాటలను తప్పు పడుతున్నారు. ఫలితంగా కెసిఆర్ ఈ అంశంపై ఘాటైన విమర్శలు చేసే అవకాశం ఏర్పడింది.దీనికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే బి. టీమ్ ఆరోపణలను బహుశా దృష్టి లో పెట్టుకుని కాబోలు చంద్రబాబు తో పాటు ప్రధాని మోడీని కూడా పనలో పనిగా కెసిఆర్ ఏకి పారేశారు.
అదే సమయంలో ఎపి ముఖ్యమంత్రి ఎన్ని మాటలు మార్చినా రాజకీయంగా విమర్శలు చేయకుండా తన సహజ ధోరణిలో కెసిఆర్ పరుష పద జాలంతో విమర్శలు చేయడం రాజకీయాలకు సంబంధం లేని వారు కూడా అంగీకరించడం లేదు. మరో విశేష మేమంటే కెసిఆర్ విమర్శ లను పూర్వ పక్షం చేస్తూ ఎపి మంత్రులు చేసిన ప్రతి విమర్శలో హైకోర్టు అంశంలో కెసిఆర్ లేవ నెత్తిన అంశాలకు జవాబు చెప్ప లేని పరిస్థితి ఉంది.ఎందు కంటే రాష్ట్ర ప్రభుత్వ బలహీనత అటు వంటిది.
అంతే కాకుండా కెసిఆర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సందర్భాల్లో అవకాశం ఇచ్చి ఉచ్చులో తగులు కొంటూ వున్నారు. కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీ ఆలోచనలు ఏలా వున్నాయో తెలుసు కోకుండా రెండు పార్టీలు కలసి పని చేద్దామని ప్రతి పాదనలు పెట్టడం తొలి తప్పు. ఒక వేళ తిరస్కరణ జరిగిన తర్వాత తనే ఆ అంశం బహిర్గతం చేయడం అదే సమయంలో కాంగ్రెసుతో జట్టు కట్టడం రెండవ మహా నేరం కాదు – ఘోరమైన ఓటమికి రహదారి ఏర్పాటు చేసుకోవడం. ఇవన్నీ కలగలసి తెలంగాణలో పరువు పోయింది. కాని ఈ రోజుకు ఆఖిల భారత తెలుగు దేశం పార్టీగా ఆత్మవిమర్శ చేసుకున్న దాఖలా లేదు.
తెలుగు దేశం పార్టీ తెలంగాణలోనే కాదు రేపు ఎపిలో కూడా గెలుపొందినా ఓటమి చెందినా అంతా చంద్రబాబు చలువ. అందుకే ఎన్ని తప్పటడుగులు వేస్తున్నా నేతలు నిమిత్తమాత్రులుగా వున్నారు.
