CP Radhakrishnan: భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతి హోదాలో ఆయన తిరుమలకు రావడం ఇది రెండోసారి. విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం, సోమవారం రాత్రి ఆయన తిరుపతికి చేరుకున్నారు.
ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర మరియు ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అర్చకులు ‘ఇస్తికఫాల్’ గౌరవంతో సంప్రదాయబద్ధంగా ఆయనను ఆలయంలోకి ఆహ్వానించారు.
ప్రత్యేక పూజలు నిర్వహించారు ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఉపరాష్ట్రపతి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధాన ఆలయంతో పాటు వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామి ఆలయాల్లో కూడా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామిని కూడా దర్శించుకున్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఉపరాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఛైర్మన్, ఈవోలు కలిసి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు.
దేశ ప్రజలందరూ శాంతి, శ్రేయస్సు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఉపరాష్ట్రపతి తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్ 25న తొలిసారి శ్రీవారిని దర్శించుకున్న ఆయన, అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ‘వెంకటాద్రి నిలయం’ వసతి సముదాయాన్ని ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

